డివిడెండ్పై కంపెనీలకు ఊరట.. వాటా దారులకు పన్ను భారం
న్యూఢిల్లీ: కంపెనీలపై డివిడెండ్ పంపిణీ పన్నును (DDT) రద్దు చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక నుంచి DDTని వాటాదారులు చెల్లించాలి. వాటాదారులు తమ ఆదాయానికి ఈ డివిడెండ్ ఆదాయాన్ని కూడా కలిపి తమకు వర్తించే ఆదాయపు పన్ను రేటు ప్రకారం దానిపై పన్ను చెల్లించాలి. డివిడెండ్ ఎత్తి వేయడం ద్వారా వార్షిక ఆదాయం రూ.25వేల కోట్లు తగ్గవచ్చునని అంచనా.
వాటాదారులకు పన్ను
ఈక్విటీ మార్కెట్ను మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పాటు మార్కెట్లోని చిన్న మదుపరులకు ఊరట కల్పించేందుకు DDTని తొలగించి సంప్రదాయ డివిడెండ్ పన్ను విధానాన్నే అనుసరించాలని ప్రతిపాదిస్తున్నట్లు నిర్మల తెలిపారు. కొత్త విధానంలో కంపెనీలు DDT చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకున్న డివిడెండ్పై వాటాదారులు మాత్రం వారికి వర్తించే రేటుకు అనుగుణంగా పన్ను విధించడబడుతుంది.
అందుకే..
ప్రస్తుత డీడీటీ విధానంలో ఇన్వెస్టర్లపై పన్ను భారం పెరుగుతోందని, భారత్లో చెల్లించే DDTపై విదేశీ ఇన్వెస్టర్లలో చాలామందికి తమ స్వదేశంలో పన్ను మినహాయించుకునే అవకాశం లేదని, దాంతో వారికి ఈక్విటీ పెట్టుబడులపై లభించే ప్రతిఫలాలు తగ్గుతున్నాయని నిర్మల గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భారత విభాగం నుంచి డివిడెండ్ పొందే హోల్డింగ్ కంపెనీలకి పన్ను మినహాయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.
పెట్టుబడులకు అనుకూలం
ఉదాహరణకు 30 శాతం పన్ను స్లాబ్లో ఉన్నవాళ్లు తమకు లభించిన డివిడెండ్ పైన 30 శాతం పన్నును చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం 15 శాతం DDTతో పోలిస్తే ఇది ఎక్కువ. ఈ ప్రతిపాదన వల్ల పెట్టుబడులకు భారత్ మరింత ఆకర్షణీయంగా మారుతుందని భావిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.20వేల కోట్ల ఆదాయం తగ్గుతుంది. ఇప్పటి వరకు వాటాదారులకు చెల్లించే డివిడెండ్ పైన 15 శాతం DDTతో పాటు సర్ ఛార్జ్, సెస్ కలిపి 20.35 శాతం పన్ను ఉంది.
మిశ్రమ స్పందన
DDT రద్దుపై మార్కెట్ వర్గాల్లో స్పందన కనిపించింది. ఈ నిర్ణయం పెద్ద కార్పొరేట్ కంపెనీలు, బహుళ జాతి కంపెనీలకు ప్రయోజకరమని, కంపెనీ ప్రమోటర్లు, బడా ఇన్వెస్టర్లపై మాత్రం అదనపు భారం పడుతుందని అంటున్నారు. పెద్ద ఇన్వెస్టర్లపై పన్ను భారం 43% వరకు పెరగవచ్చనని అంటున్నారు.