అక్టోబర్ 1 నుండి టీవీల ధరలు పెరుగుతున్నాయ్! రూ.1,500 వరకు పెంపు?
న్యూఢిల్లీ: LED టీవీల తయారీ కోసం వినియోగించే ఓపెన్ సెల్ దిగుమతులపై అక్టోబర్ 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం 5 శాతం సుంకాన్ని అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 2017 డిసెంబర్ నుండి టీవీ విడిభాగాలపై 20 శాతం కస్టమ్స్ సుంకం ఉంది.
అయితే ఓపెన్ సెల్ తయారీ దేశీయంగా చేపట్టేవరకు, దిగుమతికి అంగీకరించాలని పరిశ్రమ కోరడంతో 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. పరిశ్రమకు ఇచ్చిన గడువు ఈ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1వ తేదీ నుండి ఓపెన్ సెల్ పైన గతంలో ప్రకటించినట్లుగా 5 శాతం కస్టమ్స్ సుంకం అమలవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.
దీపావళి నాటికి బంగారం ధరలు షాకిస్తాయా? ఎంత పెరగొచ్చు, ఎందుకు?
సుంకం విధించకుంటే...
సుంకం విధించకపోతే, విడిభాగాలు తయారు చేయకుండా, దిగుమతి చేసుకొని, టీవీల అసెంబ్లింగ్ మాత్రమే దేశీయంగా తయారు చేస్తున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గడువు తీరిపోవడంతో అక్టోబర్ 1వ తేదీ నుండి మళ్లీ 5 శాతం సుంకం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సుంకం విధింపు నేపథ్యంలో టీవీల ధరలు పెరగనున్నాయి. ఓపెన్ సెల్స్ పైన ఐదు శాతం సుంకం విధిస్తే టీవీ ధరలు పెంచాల్సి వస్తుందని దేశీయ టీవీ తయారీదారులు అన్నారు.
ధరలు ఎంత పెరుగుతాయంటే
సుంకం విధింపుతో టీవీల ధరలు దాదాపు నాలుగు శాతం వరకు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రూ.600 నుండి రూ.1500 వరకు ధరలు పెరగనున్నాయి. 32 ఇంచుల నుండి 42 ఇంచుల టీవీల ధరలు రూ.600 నుండి రూ.1500 వరకు పెరుగుతాయని, పెద్ద స్క్రీన్ టీవీల ధరలు మరింతగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా తయారు చేసిన ప్యానల్ ధర ఇప్పటికే 50 శాతం పెరిగిందని, ఓపెన్ సెల్ పైన ఇప్పుడు 5 శాతం కస్టమ్స్ విధించడం వల్ల ధరలు పెంచాల్సిన పరిస్థితి అంటున్నారు.
రూ.250 వరకు మాత్రమే
అయితే ఓపెన్ సెల్ను ప్రముఖ బ్రాండెడ్ సంస్థలు రూ.2700 నుండి రూ.4500 చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయని, ఓపెన్ సెల్ ప్రాథమిక ధరను బట్టి దిగుమతి సుంకం భారం రూ.150 నుండి రూ.250కి మించదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఓపెన్ సెల్ వంటి కీలకమైన ఉత్పత్తులను దీర్ఘకాలం దిగుమతి చేసుకుంటే దేశీయంగా టీవీల తయారీ రంగంలో ఎదుగుదల ఉండదని చెబుతున్నారు. సుంకం విధింపు ద్వారా దేశీయంగా తయారీకి తోడ్పాడు అవుతుందని చెబుతున్నారు.