ప్యాకేజీ సిద్దమవుతోంది.. గుడ్న్యూస్ చెప్పిన ఆర్థిక శాఖ అధికారి
అవసరమైతే మరో ఆర్థిక ప్యాకేజీ ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కొద్దిరోజులకే ప్రభుత్వ అధికారి ఒకరు గుడ్ న్యూస్ చెప్పారు. తాము మరో ఆర్థిక ప్యాకేజీ పైన కసరత్తు చేస్తున్నామని సీనియర్ ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారి ఒకరు తెలిపారు. ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీ తరుణ్ బజాజ్ మాట్లాడుతూ.. మరో ప్యాకేజీపై కసరత్తు చేయాలని తమకు ఆర్థికశాఖ మంత్రి నుండి ఆదేశాలు వచ్చాయని, దీనిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి సుదీర్ఘ లాక్ డౌన్ విధించారు. జూన్ నుండి ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకున్నాయి. సెప్టెంబర్లో డిమాండ్ పుంజుకుంది. కానీ ఆశించిన వృద్ధి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరో ప్యాకేజీపై కేంద్రం కసరత్తు చేస్తోంది.
గూగుల్ బాటలోనే.. ఉద్యోగుల ఆరోగ్యం కోసం అమెజాన్ కీలక నిర్ణయం
ప్యాకేజీపై విజ్ఞప్తులు
వృద్ధిని వేగవంతం చేసి ఆర్థిక వ్యవస్ధలో డిమాండ్ను పెంచేందుకు ప్రభుత్వం మరో ప్యాకేజీని ప్రకటించాలని అన్ని రంగాల నుండి విజ్ఞప్తులు వచ్చాయి. ఆయా రంగాల నుండి విజ్ఞప్తుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్యాకేజీపై కసరత్తు చేస్తోంది. ఉద్దీపన చర్యల కోసం ఆర్థిక శాఖకు వివిధ మంత్రిత్వ శాఖలు, రంగాల నుంచి సూచనలు, ప్రతిపాదనలు అందాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు.
బ్యాంకులకు మూలధనం ఆదా
మార్కెట్ పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని తరుణ్ బజాజ్ అన్నారు. ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా బైలేటరల్ నెట్టింగ్ ఆఫ్ క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ బిల్లు తీసుకు వచ్చామని ఉదహరించారు. దీని వల్ల ఓ అంచనా ప్రకారం బ్యాంకులకు మాత్రమే రూ. 50,000 నుండి రూ.60,000 కోట్ల మేర మూలధనం ఆదా అవుతుందన్నారు.
డిమాండ్ పెంచే దిశగా చర్యలు..
'మరో ఉద్దీపన ప్యాకేజీ లేదని చెప్పడం లేద'ని నిర్మలా సీతారామన్ ఇటీవల అన్నారు. తాము ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన ప్రతిసారి ఎన్నో విధాలుగా చర్చలు జరిపి, నిర్దిష్ట వర్గాల వారికి ప్రయోజనం కలిగేలా చూస్తున్నామని, అవసరమైతే మరో ఉద్దీపన ప్యాకేజీకి తలుపులు తెరిచే ఉన్నాయని నిర్మల చెప్పారు. ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని లాక్ డౌన్ సమయంలో ప్రకటించింది. ఎంఎస్ఎంఈలు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు సహా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కలిగేలా ప్రకటన చేశారు. అక్టోబర్ 12న ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వరాలు ఇచ్చి వ్యవస్థలో డిమాండ్ పెంచేదిశగా చర్యలు చేపట్టారు. రూ.46,675 కోట్ల డిమాండ్ ప్యాకేజీని ప్రకటించారు.