ఎయిరిండియా విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఎంత వస్తుందంటే?
ఎయిరిండియా విక్రయం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? రూ.2700 కోట్లు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఎయిరిండియాను విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్ ద్వారా ప్రభుత్వం రూ.2700 కోట్లు సమీకరిస్తుందని దీపమ్ సెక్రెటరీ తుహిమ్ కుంట పాండే అన్నారు. టాటా సన్స్ ఎయిరిండియా బిడ్ను గెలుచుకున్నదని తెలిపారు. టాటా సన్స్ రూ.18,000 కోట్లకు ఈ బిడ్ను గెలుచుకుందని, ఎయిరిండియాలో వంద శాతం వాటాను దక్కించుకోనుందని, అలాగే గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ AISATS, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో యాభై శాతం వాటా దక్కించుకుంటుందని తెలిపారు. రూ.14,718 కోట్ల వ్యాల్యూ కలిగిన ల్యాండ్, బిల్డింగ్ వంటి నాన్ కోర్ అసెట్స్ ఈ ట్రాన్సాక్షన్ పరిధిలోకి రావని, ఈ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్లింగ్ కంపెనీ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ (AIAHL) ట్రన్సుఫర్ అవుతాయని తెలిపారు. ఎయిరిండియా రుణ మొత్తం రూ.61,562 కోట్లుగా ఉంది. ఈ రుణాల్లో టాటాలు రూ.15,300 కోట్లు భరిస్తుంది. మిగతా రూ.46,262 కోట్లుగా ఉంటుంది. ఇది కంపెనీని ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక ప్రమాదం నుండి వేరి చేయడానికి ఇది ఎస్పీవీకి వెళ్తుంది.
వెల్కం బ్యాక్ ఎయిరిండియా
ఎయిరిండియా 68 సంవత్సరాల తర్వాత తిరిగి తన సొంత యాజమాన్యం చేతికి వెళ్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రయివేటీకరించేందుకు బిడ్డింగ్ నిర్వహించగా టాటా సన్స్ విజయవంతమైన బిడ్డర్గా నిలిచింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ఛైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. 'ఎయిరిండియాకు తిరిగి స్వాగతం' అని ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీ మాజీ ఛైర్మన్ జేఆర్డీ టాటా ఎయిరిండియా విమానం నుండి దిగుతున్న ఫొటోను పోస్ట్ చేశారు.
ఎయిరిండియా కోసం టాటా గ్రూప్ బిడ గెలుచుకోవడం చాలా గొప్ప విషయమని, దీని పునర్నిర్మాణానికి గణనీయమైన కృషి అవసరమని అంగీకరిస్తున్నప్పటికీ ఈ పరిణామాలు విమానయాన పరిశ్రమలో టాటా గ్రూప్కు బలమైన మార్కెట్ అవకాశాలు కల్పిస్తాయని విశ్వసిస్తున్నట్లు రతన్ టాటా ట్వీట్లో పేర్కొన్నారు. ఒకప్పుడు జేఆర్డీ టాటా నాయకత్వంలో ఎయిరిండియా ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విమానయాన సంస్థగా ఖ్యాతి గడించిందని, ఇప్పుడు ఎయిరిండియాకు అలాంటి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు టాటాలకు మళ్లీ అవకాశం లభించిందని, ఈ రోజు జేఆర్డీ టాటా మన మధ్యన ఉంటే ఎంతో ఆనందపడేవారని, ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు, వెల్కమ్ బ్యాక్, ఎయిరిండియా అని పేర్కొన్నారు.
చెల్లింపులు
బిడ్ మొత్తంలో ఎయిరిండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్స్ చెల్లించాలి. ఎయిరిండియా కోసం పలు సంస్థలు ఆర్థిక బిడ్స్ దాఖలు చేశాయి. స్పైస్ జెట్ అధినేత అజయ్ సింగ్ కూడా ఆర్థిక బిడ్ సమర్పించారు. ఎయిరిండియా నుండి ప్రభుత్వం వంద శాతం వాటాను ఉపసంహరించుకుంటోంది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్లోను 50 శాతం మొత్తాన్ని వదులుకుంటుంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ (AISATS) వాటాను 50 శాతం విక్రయిస్తోంది. బిడ్డింగ్ సందర్భంగా వేసిన కమిటీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలు ఉన్నారు.ఎయిరిండియా కొనుగోలు ద్వారా టాటాల చేతికి 4400 డొమెస్టిక్, 1800 ఇంటర్నేషనల్ ల్యాండింగ్స్ అండ్ పార్కింగ్ స్లాట్స్ అందుబాటులోకి వస్తాయి.
దశాబ్దాల చరిత్ర
90 సంవత్సరాల క్రితం 1932లో ఎయిరిండియాను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో టాటా గ్రూప్ ప్రారంభించింది. 1953లో జాతీయీకరణ నేపథ్యంలో ప్రభుత్వం పరమైంది. ఆ తర్వాత 1977 వరకు నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 68 ఏళ్ల తర్వాత తిరిగి మళ్లీ టాటాల చేతికే వెళ్తోంది. డిసెంబర్ నాటికి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయి, టాటా సన్స్ చేతికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కలిపి ఆగస్ట్ డొమెస్టిక్ మార్కెట్ షేర్ 13.20 శాతంగా ఉంది. డెయిలీ డొమెస్టిక్ ఫ్లైట్స్ 180 నుండి 185 వరకు. కరోనాకు ముందు 200 కంటే ఎక్కువగా ఉన్నాయి. కరోనాకు ముందు 85 డొమెస్టిక్ డెస్టినేషన్స్కు కార్యకలాపాలు నిర్వహించింది. అలాగే 40 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. 15,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దేశంలో, అంతర్జాతీయంగా ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ పాసింజర్ ఫ్లైయింగ్ మార్కెట్ షేర్ 18.8 శాతంగా ఉంది. ఈ రెండు కలిపితే అతిపెద్ద వాటా ఎయిరిండియాదే. దేశీయ సంస్థల అంతర్జాతీయ మార్కెట్ షేర్ 39.2 శాతంగా ఉండగా, ఇందులో ఇండిగో 12.8 శాతం, ఎయిరిండియా 11.5 శాతం, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 7.3 శాతం, స్పైస్ జెట్ 5 శాతం, గోఎయిర్ 2.6 శాతంగా ఉంది.