ఖర్చుచేసే వారి చేతికి నగదు: ప్రభుత్వం జూలై వరకు ఎంత ఖర్చు చేసిందంటే?
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. వ్యక్తుల నుండి కంపెనీల వరకు ఊతమిచ్చేందుకు భారీ ప్యాకేజీ ఇచ్చింది. జీడీపీలో ఇది 10శాతం కంటే ఎక్కువ. భారీ ఉద్దీపన ప్రకటించినా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ప్రభుత్వ వ్యయం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే స్వల్పంగా మాత్రమే పెరిగింది. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పాటు జూలై నెలకు అంటే మొత్తం నాలుగు మాసాలకు రూ.9.74 లక్షల కోట్లు ఖర్చు చేయగా, ఈసారి అదే నాలుగు నెలల కాలంలో రూ.1.07 లక్షల కోట్లు (11.3 శాతం) మాత్రమే పెరిగి రూ.10.54 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఖర్చులో ఎక్కువ భాగం వేతనాల చెల్లింపులు, ఇతర సాధారణ ఖర్చులు ఉన్నాయి.
ఆ టైంలో 1.7 కోట్ల ఉద్యోగాలు పోయాయి: అర్బన్ జాబ్స్.. ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం
ప్రభుత్వ ఖర్చు కీలకం... కానీ
కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు లేక, జీడీపీ రికార్డ్స్థాయిలో పతనం కావడంతో ప్రభుత్వ ఖర్చు చాలా కీలకమని ఆర్థికవేత్తలు సూచించారు. జీఎస్టీ సహా వివిధ మార్గాల్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో అసెట్స్ మోనిటైజేషన్, ప్రభుత్వ కంపెనీల వాటాల విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో జీడీపీ 24 శాతం మేర క్షీణించింది. అదే సమయంలో ప్రభుత్వ ఖర్చు జీడీపీలో 0.5 శాతం లేదా రూ.1 లక్ష కోట్లు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. అసమానంగా ఉందని చెబుతున్నారు.
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ఉపయోగపడింది కానీ...
కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు నగదు బదలీ, ఉచిత రేషన్, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి వివిధ మార్గాల ద్వారా అత్మనిర్భర్ భారత్ ఉపయోగపడింది. అయితే ప్రభుత్వం నుండి ఆర్థికపరంగా రావాల్సిన పుష్ లేదని అంటున్నారు. గణాంకాల ప్రకారం ఏప్రిల్-జూలై మధ్య ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.10,54,209 కోట్లు. ఇందులో రెవెన్యూ అకౌంట్ రూ.9,42,360 కోట్లు, రూ.1,11,849 కోట్లు క్యాపిటల్ అమౌంట్. మొత్తం రెవెన్యూ వ్యయంలో 1,98,584 కోట్లు వడ్డీ చెల్లింపుల కోసం, 1,04,638 కోట్లు ప్రధాన రాయితీల కోసం ఉపయోగించారు. ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఈ మాత్రం సరిపోదని అంటున్నారు. రిలీఫ్ ప్యాకేజీలో రూ.2.1 లక్షల కోట్లు చేశారు.
చేతుల్లో డబ్బులు ఉండేలా...
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వినియోగదారుల చేతుల్లో డబ్బులు ఉండేలా చూడాలని, కానీ అది పన్ను కోత రూపంలో ఉండకూడదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కరోనా కారణంగా కిందిస్థాయి వరకు ప్రతి ఒక్కరిపై ప్రభావం పడిందని, వినియోగదారుల చేతుల్లో డబ్బులు ఉండేలా చూడాలని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే పంత్ అన్నారు. ఆర్బీఐ గత నెలలో విడుదల చేసిన వార్షిక నివేదికలోను ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ బలహీనపడిందని, ప్రయివేటీకరణ ద్వారా నిధులు సమకూర్చాలని సూచించిందని గుర్తు చేస్తున్నారు.
వారి చేతుల్లో తక్షణ మొత్తాలు
ప్రభుత్వం నుండి ఖర్చులు అవసరమని, అదే సమయంలో ఆదా చేయకుండా, ఖర్చులు చేసే వారి చేతుల్లో తక్షణ మొత్తాలు అవసరమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అలా ఉంటే ఉపాధిని నిలబెట్టేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేయాలని, ఇది దీర్ఘకాలంలో విలువైన పెట్టుబడి అని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయివేటు రంగాలు, ఇతరులు ఖర్చు చేసే పరిస్థితుల్లో లేరని, ప్రభుత్వం చొరవ అవసరమని, అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని చెబుతున్నారు.