గుడ్న్యూస్: ఏపీ, తెలంగాణ మెడికల్ డివైసెస్ పార్కులకు కేంద్రం అనుమతి
రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు కేంద్రం తీపి కబురు అందించింది. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు తలపెట్టిన మెడికల్ డివైసెస్ పార్కులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. మేక్ ఇన్ ఇండియా ను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ సంబంధిత మెడికల్ డివైసెస్ పార్కులు ఏర్పాటు చేసేందుకు రాష్త్ర ప్రభుత్వాలకు అడ్డంకులు తొలిగిపోయాయి.
తెలంగాణాలో సంగారెడ్డి సమీపంలో ఒక మెడికల్ డివైసెస్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో మెడికల్ డివైసెస్ పార్కును ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం లభించిన అనుమతులతో రెండు తెలుగు రాష్ట్రాలు మెడికల్ ఉపకరణాల ఉత్పత్తి కేంద్రాలుగా ఎదగనున్నాయి. ప్రస్తుతం మన దేశంలో వీటి తయారీ చాలా తక్కువగా ఉంటోంది. దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్నాం. ఇక ఈ రెండు పార్కులు పూర్తి అయితే పూర్తిగా మన వద్ద తయారు చేసే పరికరాలనే వినియోగించే అవకాశం ఉంది. దీంతో మనకు భారీ మొత్తంలో విదేశి మారక ద్రవ్యం ఆదా కానుంది.
అమ్మఒడికి దరఖాస్తు.. అర్హతలు: 75% హాజరు ఉంటేనే, తెల్లరేషన్ కార్డ్ లేకుంటే
ప్రపంచ స్థాయి ప్రమాణాలు...
హాస్పిటల్స్, సర్జరీ, టెస్టింగ్ లాబరేటరీ ల్లో ఉపయోగించే పరికరాలను మెడికల్ డివైసెస్ గా పేర్కొంటారు. ఈ పరికరాల ఉత్పత్తి భారత్ లో ఇప్పటి వరకు పెద్దగా జరగటం లేదు. విదేశాలనుంచి మన దిగుమతి చేసుకొంటాము. దీంతో వీటి ధరలు అధికంగా ఉంటాయి. అందుకే విదేశి కంపెనీలను మన దేశానికి రప్పించి ఇక్కడే వీటిని తయారు చేసేలా ప్రభుత్వాలు మెడికల్ డివైసెస్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పార్కుల్లో సంబంధిత పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ లు ఉంటాయి. ప్రపంచ స్థాయి టెస్టింగ్ లాబొరేటరీలు నెలకొల్పుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ ) ప్రమాణాలకు అనుగుణంగా పరికరాలను ఉప్పత్తి చేస్తారు. దీంతో ఇటు దేశీయంగా ఈ పరికరాలను ఉపయోగించటమే కాకుండా ... అవసరమైతే ఇక్కడి నుంచి ఎగుమతి చేయవచ్చు.
తెలంగాణలో 550 ఎకరాల్లో ...
తెలంగాణ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో సుమారు 550 ఎకరాల్లో భారీ మెడికల్ డివైసెస్ పార్కును ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీ ఎస్ ఐ ఐ సి) ఇప్పటికే 552 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అయితే, ఇందులో 186 ఎకరాల్లో పూర్తిగా మెడికల్ డివైసెస్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. మరో 127 ఎకరాలను సాధారణ పరిశ్రమలకు కేటాయించారు. 50 ఎకరాల స్థలాన్ని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. 2017 జూన్ లోనే తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దీనిని భూమి పూజ చేసి ప్రారంభించారు. పార్కు పనులు ప్రస్తుతం చాలా వేగంగా జరుగుతున్నాయి.
ఏపీ లో 200 ఎకరాలు...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం సమీపంలో ఏపీ మెడిటెక్ జోన్ పేరుతొ ఒక మెడికల్ డివైసెస్ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం 200 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా శంఖుస్థాపన చేశారు. తొలుత ఇక్కడ దేశేయా అవసరాల కోసం మెడికల్ డివైసెస్ ఉత్పత్తి చేయనున్నారు. తదుపరి ఎగుమతులపై దృష్టి సారించనున్నారు. దీంతో విశాఖపట్నం దేశంలో ఈ తరహా ఉత్పత్తుల కేంద్రంగా అవతరించనుంది. ఇప్పటికే ఈ పార్కులో ఏర్పాటు చేస్తున్న టెస్టింగ్ ల్యాబ్ నకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.
రూ 70,000 కోట్ల మార్కెట్...
ప్రపంచవ్యాప్తంగా మెడికల్ డివైసెస్ పరిశ్రమ 250 బిలియన్ డాలర్లు గా ఉంది. ఈ పరిశ్రమ మన దేశంలో అంతగా అభివృద్ధి చెందలేదు. ప్రస్తుతం భారత దేశంలో మెడికల్ డివైసెస్ పరిశ్రమ పరిమాణం సుమారు రూ. 70,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో ఈ విషయంలో భారత్ నాలుగో అతి పెద్ద మార్కెట్. కానీ మన దేశం ప్రస్తుతం 85% మేరకు మెడికల్ డివైసెస్ ఉత్పత్తులను దిగుమతి చేసుకొంటోంది. అందుకే ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన తయారీ కంపెనీలను భారత్ లో తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలో 4 మెడికల్ డెవిస్స్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. అందులో మన తెలుగు రాష్ట్రాల్లోనే రెండు పార్కులు ఉండటం విశేషం.