త్వరలో గవర్నమెంట్ లాటరీ స్కీం: బిల్లు తీసుకుంటే రూ.1 కోటి వరకు గెలిచే ఛాన్స్
వస్తు, సేవల పన్ను (GST) విధానాన్ని మరింత పకడ్బంధీగా అమలు చేయడంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం దృష్టి సారించింది. కొనుగోలు చేసిన ప్రతి విక్రేతల నుంచి బిల్లు తీసుకునేలా కొనుగోలుదారులను ప్రోత్సహించే విధమైన చర్యలకు సిద్ధపడుతోంది. ఇందులో భాగంగా లాటరీ ద్వారా భారీ ఆఫర్లు ప్రకటించనుంది.
ఆ ఛార్జీలు జీరో కావాలి: నందన్ నీలేకని, Fastagపై మరో సూచన
కస్టమర్లకు లాటరీ..
ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) సభ్యులు జాన్ జోసెఫ్ ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. కస్టమర్లకు లాటరీని ప్రవేశ పెట్టనున్నారు. విక్రేతల నుంచి బిల్లు తీసుకొనేలా ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగంగా రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు బహుమతులు ఇచ్చేలా లాటరీని ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది.
రూ.1 కోటి వరకు గెలుచుకునే ఛాన్స్
సరికొత్త లాటరీ వ్యవస్థ తీసుకు వస్తున్నామని, జీఎస్టీ కింద తీసుకున్న ప్రతి బిల్లు కూడా లాటరీ టిక్కెట్కు అర్హత పొందిందేనని, వీటన్నింటి నుండి డ్రా తీస్తారని చెప్పారు. బిల్లు తీసుకోకుండా 28 శాతం పొదుపు చేయడం కంటే రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు గెలుచుకునేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపించవచ్చునని చెప్పారు. వినియోగదారులు బిల్లులు తీసుకునేలా ప్రోత్సహించేందుకు దీనిని ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు.
కాలపరిమితి...
ప్రస్తుతం వివిధ వస్తువులపై 0, 5, 12, 18, 28 శాతం జీఎస్టీ ఉంది. లాటరీలో చేర్చబడే బిల్లులకు కాలపరిమితి కూడా ఉండనుంది. వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి లాటరీ మొత్తాన్ని చెల్లిస్తారు. కొనుగోలుదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేసి లాభాలు ఆర్జించిన వ్యాపార సంస్థలపై విధించిన జరిమానాలను ఈ నిధికి బదలాయిస్తున్నారు. జీఎస్టీ ఆదాయంలో లీకేజీలను అరికట్టేందుకు లాటరీ వ్యవస్థ, క్యూఆర్ కోడ్ వంటి వాటిపై దృష్టి సారించారు.