అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ప్లిప్కార్ట్ సంస్థలు సంక్లిష్ట వ్యవస్థలను సృష్టిస్తున్నాయని దేశంలోని రిటైల్ వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలకు సంబంధించి FDI నిబంధనలు సవరించేందుకు మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ప్రధానంగా పండుగ వంటి సమయంలో, ఇతర సమయాల్లో ఆఫర్ల పేరుతో కస్టమర్లను అతి తక్కువ ధరకు ఇస్తున్నాయి. దీంతో రిటైలర్లు దెబ్బతింటున్నారు. వర్తకుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం మార్పులకు సిద్ధమైందని తెలుస్తోంది.
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
మరిన్ని సవరణలు
కొనుగోలుదారులను, అమ్మకందారులను మార్కెట్కు అనుసంధానించి వ్యాపారాన్ని నిర్వహించేందుకు మాత్రమే విదేశీ ఈ-కామర్స్ సంస్థలను భారత్ అనుమతిస్తోంది. కానీ ఈ-కామర్స్ సంస్థలు నేరుగా తమ ప్లాట్ ఫామ్ ద్వారా వస్తువులు విక్రయించేందుకు వెసులుబాటులేదు. మూడేళ్ల క్రితమే 2018 డిసెంబర్లో చిన్న వ్యాపారులకు అనుకూలంగా, ఈ కామర్స్ సంస్థలకు షాకిచ్చేలా మోడీ ప్రభుత్వం FDI నిబంధనలను సవరించింది. అమ్మకందారులతో కలిసి వారి ఉత్పత్తులపై ఆఫర్లు ఇవ్వడాన్ని నిషేధించింది. ఇది తమ సంస్థలపై వివక్ష అని అమెరికా అప్పుడు గగ్గోలు పెట్టింది. అయినప్పటికీ నిబంధనలు పక్కదారి పట్టిస్తూ విక్రయాలు జరుపుతున్నాయి ఈ-కామర్స్ సంస్థలు. ఈ నేపథ్యంలో FDIకి సంబంధించి మరిన్ని సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఇలా పక్కదారి
పండుగలు, ప్రత్యేక సేల్స్ పేరుతో ఈ-కామర్స్ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్లు, ఆఫర్ల కారణంగా చిన్న వ్యాపారులు దెబ్బతింటున్నారు. పెద్ద సంస్థలతో పోటీ పడలేకపోతున్నారు. లాభాలు లేకపోయినా మార్కెట్పై గుత్తాధిపత్యం ప్రదర్శించే దిశగా సాగుతున్నాయి ఈ కామర్స్ సంస్థలు. ఈ-కామర్స్ దిగ్గజాలు తమ మాతృసంస్థ లేదా అనుబంధ సంస్థల ద్వారా అమ్మకందారుల కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ నిబంధనలను పక్కదారి పట్టిస్తున్నాయి. దీంతో అలాంటి అవకాశం లేకుండా FDI నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తోందని తెలుస్తోంది.
గట్టి షాక్
దేశీయ ఆన్లైన్ అమ్మకాలలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ముందంజలో ఉన్నాయి. అగ్రస్థానంలో ఉన్న రెండు పెద్ద కంపెనీల్లో అమెజాన్కు పరోక్ష వాటా ఉంది. కేంద్రం మరోసారి మార్పులు చేస్తే ఇలాంటి ఈ-కామర్స్ దిగ్గజాలకు గట్టి షాక్ తగులుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ-కామర్స్ సంస్థల్లో 100 శాతం FDIలకు అనుమతి ఉంది. కానీ ఇన్వెంటరీ ఆధారిత యాక్టివిటీస్కు అనుమతి లేదు.