మోడీ ప్రభుత్వానికి షాక్: రూ.2 లక్షల కోట్ల ఖర్చులు తగ్గించాల్సిందే.. లేదంటే!
న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా ఆర్థిక మందగమనం వెంటాడుతోంది. దీంతో ప్రభుత్వానికి జీఎస్టీ కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం వ్యయ నియంత్రణపై దృష్టి సారించింది. భారత్ జీడీపీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో వరుసగా తొలి, రెండో క్వార్టర్లలో 5 శాతానికి, 4.5 శాతానికి పడిపోయింది.
హైదరాబాద్లో బ్లూజే అతిపెద్ద ఆఫీస్, ఏడాదిలో 350 ఉద్యోగాలు
రూ.2.5 లక్షల కోట్లు క్షీణించింది
భారత్కు ఓవైపు ప్రయివేటురంగ పెట్టుబడుల కొరత, మరోవైపు మందగమనం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఖర్చుల్ని తగ్గించుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖజానాకు రెవెన్యూ దాదాపు రూ.2.5 లక్షల కోట్లు క్షీణించిందని, దీంతో ఈసారి కేంద్రం నిర్దేశిత ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.2 లక్షల కోట్లను తగ్గించుకోవాలని..
2019-20 ఆర్థిక సంవత్సరం వ్యయలక్ష్యం రూ.27.86 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో సుమారు 65 శాతం నవంబర్ నాటికే దాటింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రభుత్వ ఖర్చులు తగ్గుముఖం పట్టాయి. వ్యయ లక్ష్యంలో కనీసం రూ.2 లక్షల కోట్లను అయినా తగ్గించుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఇది దాదాపు 7 శాతానికి సమానం. ఈ నేపథ్యంలో రాబోయే నెలల్లో ప్రభుత్వ వ్యయం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
అదే జరిగితే జీడీపీ మరింత తగ్గుతుంది
ఖర్చును తగ్గించుకుంటేనే జీడీపీలో ద్రవ్యలోటును కట్టడి చేయగలమని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి జీడీపీలో ద్రవ్యలోటును 3.8 శాతానికే అదుపు చేయాలని యోచిస్తోంది. ఇంతకుముందు ఈ టార్గెట్ 3.3 శాతంగా ఉంది. ప్రస్తుత మందగమనం నేపథ్యంలో దీనిని 3.8 శాతానికి పెంచారు. డిమాండ్ కొరత, మార్కెట్లో స్తబ్ధత, కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ఆశించిన మేర లేవని, దీంతో పన్ను వసూళ్లు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రయివేటు రంగ పెట్టుబడులు మరింత తగ్గితే జీడీపీ ఇంకా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.