PMJJBY become costly: ప్రీమియం పెరిగింది... కానీ
ప్రభుత్వ ఇన్సురెన్స్ స్కీమ్ ప్రీమియం పెరిగింది. దీంతో పాటు ఇన్సురెన్స్ వ్యాల్యూ కూడా పెరిగింది. జీవిత బీమాకు ప్రాధాన్యం ఎంతో. మనకు కావాల్సిన వ్యక్తి లేదా కుటుంబ భారాన్ని మోసే వ్యక్తి మరణిస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. లైఫ్ ఇన్సురెన్స్ ఉంటే చాలా వరకు ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికీ జీవిత బీమా ఉండాలని నిపుణులు సూచిస్తారు.
దేశంలోని అన్ని కుటుంబాలకు ఆర్థిక భద్రత ఉండాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను(PMJJBY) తీసుకు వచ్చింది. PMJJBY ప్రభుత్వ మద్దతు కలిగిన పూర్తి టర్మ్ పాలసీ. ఏ కారణం చేత అయినా పాలసీదారు మృతి చెందితే ఆ కుటుంబానికి హామీ లభిస్తుంది. ఈ పథకం ఒక సంవత్సరం కాలపరిమితితో వస్తుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రీమియం చెల్లించి పథకాన్ని రెన్యూవల్ చేసుకోవచ్చు.
ఎల్ఐసీతో పాటు అన్ని జీవిత బీమా సంస్థలు ఈ పథకాన్ని అందిస్తున్నాయి. ఈ పథకం బ్యాంకుల్లోను అందుబాటులో ఉంది. పద్దెనిమిదేళ్ల నుండి యాభై సంవత్సరాల వయస్సు వారు అర్హులు. సేవింగ్స్ ఖాతా ఉన్న వారు ఈ పథకంలో చేరవచ్చు. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానమై ఉండాలి. కేవైసీ తప్పనిసరి. 55 సంవత్సరాల వరకు జీవిత బీమా పొందే వీలుంటుంది. 50 ఏళ్ల లోపు వారు మాత్రమే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఉదాహరణకు 25 ఏళ్లకు పాలసీ తీసుకుంటే 55 సంవత్సరాల వరకు రిస్క్ కవరేజీ కోసం పథకాన్ని పునరుద్ధరించవచ్చు. అదే యాభై ఏళ్లకు తీసుకుంటే 55 ఏళ్ల వరకు.. అంటే అయిదేళ్లు మాత్రమే రిస్క్ కవరేజ్ పొందవచ్చు.
ప్రభుత్వం ఇటీవల ప్రీమియంను పెంచింది. ఏడాదికి వర్తించే ప్రీమియం రూ.2015లో రూ.330 మాత్రమే. ఈ ఏడాది రూ.436కు పెంచింది. పెంచిన ప్రీమియం రేట్లు జూన్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చాయి. ప్రతి ఏడాది మే 31న ప్రీమియం చెల్లించాలి. ఈ పథకంలో చేరితే ప్రతి సంవత్సరం ప్రీమియం ఆటో డెబిట్ ఉంటుంది. పాలసీదారు అనుకోకుండా మృతి చెందితే రూ.2 లక్షల హామీ మొత్తాన్ని నామినీకి అందిస్తారు.