వాహనదారులకు గుడ్న్యూస్, FASTag గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగింపు
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ నుండి ఫాస్టాగ్(FASTag) తప్పనిసరి అని ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే వాహనదారులకు ఊరట కల్పించింది. దీనిని మరో నెలన్నర పొడిగించింది. తాజాగా ఈ గడువును ఫిబ్రవరి 15, 2021 వరకు పొడిగించింది.
మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్సుపోర్ట్ అండ్ హైవే(MoRTH) ఫాస్టాగ్ టోల్ ఛార్జీ గడువును జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీకి పొడిగించింది.' అని తెలిపింది. వాస్తవ గడువు ప్రకారం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) జనవరి 1 నుండి టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ చెల్లింపుకు పూర్తిగా మారాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఆ గడువును పొడిగించి, వాహనదారులకు ఊరట కల్పించారు.
డబుల్ టోల్
టోల్ ప్లాజా వద్ద నగదు చెల్లింపుకు స్వస్తీ పలకాలని నిర్ణయించిన కేంద్రం. జనవరి 1 నుండి గడువును ఫిబ్రవరి 15కు పెంచిన నేపథ్యంలో అప్పటి నుండి.. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ కలిగిన ఫోర్ వీలర్ లేదా అంతకుమించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఫాస్టాగ్ లేని వాహనం టోల్ ప్లాజాలోకి వస్తే రెండింతల మొత్తాన్ని టోల్ ట్యాక్స్గా వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. పర్యవేక్షణకు మార్షల్స్, నోడల్ అధికారులను నియమిస్తారు.
సమయం ఆదా
టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం వాహనాలను ఆపకుండా ఫాస్టాగ్స్ నివారిస్తాయి. ఫలితంగా ఇంధనం, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. దేశవ్యాప్తంగా 30 వేలకు పైగా పాయింట్స్ ఆఫ్ సేల్స్(POS)లో ఫాస్టాగ్ పాయింట్స్ అందుబాటులో ఉన్నట్లు ఇటీవల కేంద్రమంత్రి తెలిపారు. ఫాస్టాగ్ ప్రోగ్రాం కోసం 27 బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్ డీల్లో కూడా ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. భారత్ బిల్ పేమెంట్ సిస్టం, యూపీఏ, పేటీఎం, మైఫాస్ట్ మొబైల్ యాప్స్తోను భాగస్వామ్యం ఉంది.
ఫాస్టాగ్ విధానం
ఫోర్ వీలర్స్, అంతకంటే పెద్ద వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేయాలంటే థర్డ్ పార్టీ బీమా రెన్యూవల్కు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఫాస్టాగ్ తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనలు తీసుకు వచ్చాయి. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించే లక్ష్యంతో కేంద్రం 2017లో ఫాస్టాగ్ విధానాన్ని తెచ్చింది. ఆ తర్వాత ఫాస్టాగ్ను తప్పనిసరి చేస్తోంది.