budget 2020: ATFపై పన్ను భారం తగ్గొచ్చు, ఒక సీసా విదేశీ మద్యమే కొనాలి!
2020-21 బడ్జెట్లో విమాన ఇంధనం-ATFపై పన్ను భారం తగ్గే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ATFపై వస్తువు విలువ ఆధారిత (యాడ్ వెలోరం) పద్ధతిలో పన్ను విధిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగినప్పుడల్లా దేశంలో ATF ధర పెరుగుతుంది. దీనికి బదులు ATFపై కిలో లీటర్లకు (1,000 లీటర్లు) ఇంత అని ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.
అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయి! 10 రోజుల్లో ఎంత అంటే?
నిర్దిష్ట పన్నుతో విమానయాన సంస్థలకూ ప్రయోజనం
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పైన ఈ నిర్దిష్ట ఎక్సైజ్ సుంకం అమల్లో ఉంది. పెట్రోల్పై రూ.21.16, డీజిల్పై రూ.15,83 వసూలు చేస్తున్నారు. నిర్దిష్ట పన్నుతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విమానయాన పరిశ్రమకూ మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సుంకాలు ఎత్తివేయండి
కేంద్ర బడ్జెట్ పైన వివిధ కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. కోకింగ్, కోల్, మెటలర్జికల్ కోల్, సున్నపురాయి, డోలమైట్ ఖనిజాలపై దిగుమతి సుంకం పూర్తిగా ఎత్తివేయాలని ఫిక్కీ కేంద్రాన్ని కోరుతోంది. స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తిలో స్టీల్ తుక్కు దిగుమతిపై ఉన్న సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయాలని కోరుతోంది. లేదంటే చైనా వంటి దేశాలతో దేశీయ స్టీల్ సంస్థలు పోటీ పడటం ఇబ్బందికరంగా మారుతుందని తెలిపింది. ఖనిజ దిగుమతులపై ప్రస్తుతం 2.5 శాతం నుంచి 5 శాతం సుంకం ఉంది.
అలా ఐతే ఒకటే మద్యం సీసా!
ఇదిలా ఉండగా, పన్నురహిత దుకాణాల నుంచి మద్యం బాటిళ్ల కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. స్వదేశానికి వస్తున్న భారతీయులు విదేశాల్లోని విమానాశ్రయాల్లో ఒక్క సీసాకు మించి మద్యాన్ని కొనుగోలు చేయరాదని ఆర్థిక మంత్రిత్వ శాఖకు వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది. అత్యవసరం కాని ఉత్పత్తుల దిగుమతిని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం. అంటే రెండు సీసాల నుంచి ఒక సీసా మద్యానికి కోత పెట్టాలని భావిస్తోంది.
సిగరెట్ పెట్టెల కొనుగోళ్లపై కూడా నిషేధం విధించాలని వాణిజ్య శాఖ సిఫార్సు చేసింది.