కేంద్రప్రభుత్వం గుడ్న్యూస్! పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు ఛాన్స్!!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ గరిష్టాన్ని చేరుకుంటోంది. అన్ని మెట్రో నగరాల్లో రూ.90ని క్రాస్ చేసిన లీటర్ పెట్రోల్ ధర, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రూ.100 కూడా దాటింది. దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తీసుకు రావాలని సామాన్యులు కోరుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారాయి.
ప్రతిపక్షాలు కూడా ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉంది. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్ కూడా ఇటీవల మాట్లాడుతూ పెట్రోల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గించడమే పెరుగుతున్న ధరలకు ప్రత్యామ్నాయం అన్నారు.
పెరిగిన సిలిండర్ ధరలు: హైదరాబాద్లో ఎంత అంటే? LPGపై వీటి ప్రభావం
సుంకాలు తగ్గించే యోచన
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే దిశగా కాంద్రం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని భావిస్తోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చముర వినియోగదారు భారత్. భారత్ ప్రధానంగా దిగుమతులపై ఆదారపడుతోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడల్లా దేశీయ మార్కెట్లోను పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. రిటైల్ ధరల్లో దాదాపు అరవై శాతం పన్నులు, సుంకాలు ఉంటాయి. గత ఏడాది కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో ఆదాయం కోసం పెట్రోల్, డీజిల్ పైన ప్రభుత్వాలు సుంకాన్ని పెంచాయి. కొన్ని రాష్ట్రాలు కరోనా సెస్ విధించాయి.
ప్రభుత్వం రెండుసార్లు సుంకాలను పెంచింది. అదే సుంకం కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగా ఆ ప్రభావం పడుతోంది. అదే సమయంలో ఒపెక్ దేశాలు సహా చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు చుక్కలు చూపిస్తుండటంతో సెస్ తగ్గించి సామాన్యునికి భారం తగ్గించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.
మార్చి రెండో వారంలో ఊరట!
చమురు ధరలు తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రాలు, చమురు సంస్థలు, చమురు మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా సామాన్యులపై భారం తగ్గించే ఆలోచన చేస్తోంది. మిడిల్ మార్చి నాటికి సుంకం తగ్గింపు లేదా ధరల స్థిరీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ధరల స్థిరీకరణపై చర్చలు సాగుతున్నాయని, ఈ నెలలో నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.
ఒపెక్ దేశాలతో త్వరలో సమావేశం
ఒపెక్ దేశాలతో త్వరలో సమావేశమవుతామని, చమురు డిమాండ్కు అనుగుణంగా సరఫరా అంశంపై ఈ చర్చలో రానుందని, అప్పుడు పన్ను తగ్గింపుపై నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా,చమురు ధరలు తగ్గించాల్సిందేనని, కానీ వీటి ధరలు ఎప్పుడు తగ్గిస్తామో చెప్పలేమని, ఇంధన ధరలు తగ్గడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాలని ఇటీవల నిర్మలా సీతారామన్ అన్నారు.