భారత ఎగుమతుల్లో రిలయన్స్దే హవా, గూగుల్ భారీ పెట్టుబడి: ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈరోజు (జూలై 15, బుధవారం) మధ్యాహ్నం 2గంటలకు వర్చువల్ సమావేశం ప్రారంభించారు. ఇది రిలయన్స్ 43వ వార్షిక సాధారణ సమావేశం(AGM). ముఖేష్ అంబానీ తొలుత కంపెనీ బోర్డు కొత్త సభ్యులను పరిచయం చేశారు. అనంతరం షేర్హోల్డర్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం కరోనా మహమ్మారి కారణంగా చూస్తున్నామన్నారు. ఇటీవలే విడుదలైన జియోమీట్కు 5 మిలియన్ యూజర్లు ఉన్నట్లు తెలిపారు. 150 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను చేరుకున్న తొలి బారత కంపెనీ రిలయన్స్ అన్నారు. జియో డిజిటల్ గేట్ వే ఆఫ్ ఇండియా అన్నారు.
ఎగుమతుల్లో రిలయన్స్ వాటా 9.1 శాతం
డిజిటల్ అనుసంధాన వేదికగా జియో మీట్ను తీసుకు వచ్చామని ముఖేష్ అంబానీ చెప్పారు. దేశ ఎగుమతుల్లో 9.1 శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ది అని చెప్పారు. 109 దేశాలకు రిలయన్స్ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తున్నామని వెల్లడించారు. భారత్లోనే అతిపెద్ద వాణిజ్య ఎగుమతిదారుగా రిలయన్స్ ఆవిర్భవించిందన్నారు. జియో ప్లాట్ఫాంను రుణరహిత సంస్థగా మార్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిపారు. ఆధునిక మానవ చరిత్రలో కరోనా అతిపెద్ద సంక్షోభం సృష్టించిందన్నారు. కరోనా అనంతర అవకాశాలను అందుకునే దిశగా రిలయన్స్ ప్రయత్నం చేస్తోందన్నారు.
గూగుల్ రూ.33,737 పెట్టుబడి
రిలయన్స్ డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్ఫాంలో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ రూ.33,737 కోట్లు పెట్టుబడులు పెట్టనుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ పెట్టుబడితో 7.7 శాతం వాటాను దక్కించుకుంటుందన్నారు. రిలయన్స్ జియోకు గూగుల్ వ్యూహాత్మక భాగస్వామి అన్నారు. డిజిటల్ విప్లవాన్ని జియో ముందుకు తీసుకు వెళ్తోందన్నారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచం సరికొత్త సాంకేతిక విప్లవం చూడనుందన్నారు.
జియో రుణరహితం...
రిలయన్స్ జియోలోకి రూ.2.12 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల సమీకరణ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నట్లు తెలిపారు. జియోను రుణరహిత సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జియో, రిటైల్ ఆయిల్ విభాగాల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. జియోకు దాదాపు హాఫ్ బిలియన్ మొబైల్ కస్టమర్లు ఉన్నట్లు తెలిపారు. మెరుగైన ప్రపంచం దిశగా ప్రయాణానికి భారత్ మార్గదర్శిగా ఉంటుందన్నారు. టెలికం రంగంలో ప్రపంచంలోనే నెంబర్ 2గా జియో నిలిచిందన్నారు.