Google: గూగుల్ సీఈఓకు లేఖ రాసిన మాజీ ఉద్యోగులు.. ఎందుకంటే..!
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తొలగించిన ఉద్యోగులు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్కి బహిరంగ లేఖ రాసి తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఒకవేళ గూగుల్లో మళ్లీ రిక్రూట్మెంట్ జరిగితే, తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆలాగే ఉక్రెయిన్ వంటి మానవతా సంక్షోభ దేశాలలో ఉద్యోగులను తొలగించవద్దని కూడా ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.
ఒక ఉద్యోగిని తొలగించినట్లయితే, అతని పూర్తి నోటీసు వ్యవధిని అందించడానికి అనుమతించాలని ఉద్యోగులు బహిరంగ లేఖలో Google CEOకి సూచించారు. ఉక్రెయిన్ వంటి దేశాల్లోని బాధిత కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్న వారికి వీసా-లింక్డ్ రెసిడెన్సీకి అదనపు సహాయాన్ని అందించాలని కూడా తెలిపింది. ఈ ఆల్ఫాబెట్ రిట్రెంచ్మెంట్ ప్రభావం ప్రపంచ స్థాయిలో కనిపించిందని లేఖలో రాసుకొచ్చారు. ఈ లేఖపై దాదాపు 1,400 మంది ఉద్యోగులు సంతకాలు చేయడం గమనార్హం.
ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ టెక్ అండ్ అలైడ్ వర్కర్స్, యూఎన్ఐ గ్లోబల్తో సహా పలు యూనియన్లు ఈ బహిరంగ లేఖ వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో పిచాయ్కి భౌతికంగా లేఖను అందించడానికి కొన్ని రోజుల ముందే ఈ లేఖను సర్క్యులేట్ చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాంద్యం భయాలతో పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఇప్పటికే చాలా మంది ఉద్యోగులను తొలగించాయి.
మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులను తొలగించింది. కొద్ది రోజుల క్రితం మెటా 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. మెటా గత నాలుగు నెలల్లో 11 వేల మంది సిబ్బందిని తొలగించింది. అమెరికాలో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతుండడం, అక్కడి బ్యాంకుల్లో ఒకటైనా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలడంతో కంపెనీలపై ఒత్తి పెరుగుతోంది.