గూగుల్ పేను ఆర్బీఐ బ్యాన్ చేసిందా? యూజర్లలో గందరగోళం: అసలు విషయం ఇదీ
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ గూగుల్పేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధించినట్లుగా జోరుగా ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో GPay banned by RBI అని పెద్ద ఎత్తున వచ్చాయి. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)స్పందించింది. గూగుల్ పేను ఇండియాలో బ్యాన్ చేయలేదని స్పష్టం చేసింది.
ఫేస్బుక్కు కంపెనీలు 'యాడ్ బహిష్కరణ', రూ.53వేల కోట్ల నష్టపోయిన మార్క్ జుకర్బర్గ్
గూగుల్ పేను నిషేధించలేదు
గూగుల్ పేను ఆర్బీఐ నిషేధించలేదని ఈ రిటైల్ చెల్లింపుల సాధికార సంస్థ NPCI తెలిపింది. దీంతో గూగుల్ పే నిషేధానికి గురైందంటూ సోషల్ మీడియాలో జరుగిన ప్రచారానికి తెరపడింది. కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. ఇటీవల కరోనా కారణంగా నగదు చెల్లింపుల కోసం ఎక్కువ మంది ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ యాప్స్ను ఉపయోగిస్తోన్న విషయం తెలిసిందే.
ఏం జరిగింది?
ఆర్థికవేత్త అభిజీత్ మిశ్రా ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సమాధానం వచ్చింది. గూగుల్ పే ఎలాంటి పేమెంట్ సిస్టంను నిర్వహించడం లేదని, అందుకే ఆ సంస్థ పేరు అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్బీఐ తెలిపింది. అయితే వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐ ద్వారా చెల్లింపులు, తదితర ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ను నిర్వహించేందుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
అక్కడే పొరపాటు
ఆర్బీఐ ఇచ్చిన వివరణను కొంతమంది పక్కన పెట్టేశారు. దీంతో గూగుల్ పేను ఆర్బీఐ నిషేధించిందని ప్రచారం ప్రారంభమైంది. దీంతో చాలామంది గందరగోళానికి గురయ్యారు. గూగుల్ పేను ఆర్బీఐ థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్గా గుర్తించింది. దీనిని థర్డ్ పార్టీ యాప్గా గుర్తించిందని, చట్టబద్దమైనదే అని, గూగుల్ పై ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ సురక్షితమైనవని NPCI స్పష్టంచేసింది.