Google: సీసీఐ పెనాల్టీలతో దిగొచ్చిన గూగుల్.. Google Play బిల్లింగ్ కు బ్రేక్..
Google: అమెరికా టెక్ దిగ్గజానికి భారత కాంపిటీటివ్ కమిషన్ ఇచ్చిన వరుస షాకులతో దెబ్బకు దిగొచ్చింది. గూగుల్ తనకు ఉన్న వ్యాపార ఆధిపత్య ధోరణిని దుర్వినియోగం చేసిందంటూ సీరియస్ అవుతూ వారం వ్యవధిలోనే రెండు సార్లు భారీ పెనాల్టీలు విధించింది. దీంతో చేసేది లేక కంపెనీ వెనక్కు తగ్గింది.
బిల్లింగ్ నిలిపివేత..
ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్ల విషయంలో పెనాల్టీ విధించిన సీసీఐ, తర్వాత గూగుల్ ప్లే బిల్లింగ్ విషయంలో జరిమానా విధించింది. దీంతో గూగుల్ Vs సీసీఐ లాగా పరిస్థితి కనిపించింది. దీంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవలి తీర్పును అనుసరించి గూగుల్ భారతదేశంలో తన యాప్లో బిల్లింగ్ సిస్టమ్ అమలును నిలిపివేసింది.
భారత డెవలపర్స్..
భారతీయ యాప్ డెవలపర్స్ తమ యాప్లను Google Play బిల్లింగ్ సిస్టమ్తో అనుసంధానించవలసి ఉంటుంది. ఇది యాప్ చేసే ప్రతి విక్రయానికి కమీషన్ను ఛార్జ్ చేస్తుంది. దీనిపై గతవారం సీసీఐ స్పందిస్తూ.. థర్డ్ పార్టీ బిల్లింగ్ లేదా చెల్లింపు ప్రాసెసింగ్ సేవలను ఉపయోగించకుండా యాప్ డెవలపర్లను నిషేధించవద్దంటూ Googleని ఆదేశించింది. తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను రూ.936.44 కోట్ల భారీ జరిమానాను విధించింది.
భారత్ బయట..
భారత్ బయట ఉన్న యాప్ డెవలపర్స్ ఇప్పటికీ Google బిల్లింగ్ సిస్టమ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టెక్ దిగ్గజం భారతదేశంలోని చట్టపరమైన ఆప్షన్లను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. గూగుల్ గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో తన యాప్లో చెల్లింపు పద్ధతిని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ యాప్ యాప్ డెవలపర్ల కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత కారణంగా విఫలమైంది.
రుసుముల తగ్గింపు..
టెక్ దిగ్గజం తన యాప్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశీలనను ఎదుర్కొంటోంది. సబ్స్క్రిప్షన్ ఆధారిత సేవల రుసుములను తగ్గించడంతో పాటు అనేక మార్పులు చేస్తోంది. అక్టోబర్ 2021లో Google తన అన్ని సబ్స్క్రిప్షన్ ఆధారిత సేవలకు సంబంధించిన ఫీజులను 30 శాతంగా ప్రవేశపెట్టింది. దీనిని తాజాగా జనవరి 1, 2022 నుంచి 15 శాతానికి తగ్గించింది.
పైలట్ ప్రోగ్రామ్..
గూగుల్ మార్చి 2022లో పైలట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. అందులో పాల్గొనే నాన్-గేమింగ్ డెవలపర్లు 6-11 శాతం వరకు తగ్గిన సర్వీస్ ఛార్జ్ తో Google Playతో పాటు, థర్డ్-పార్టీ బిల్లింగ్ సిస్టమ్ను వినియోగించుకునేందుకు అనుమతించింది. సెప్టెంబర్ 2022లో పైలట్ ప్రోగ్రామ్ ను ఇండియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, జపాన్, యూరోపియన్ ఎకనామిక్ ఏరియా వంటి నాలుగు ఇతర మార్కెట్లకు విస్తరించింది.