గూగుల్ నుండి ఆ కీలక ఉద్యోగి ఔట్, సుందర్ పిచాయ్ క్షమాపణ!
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) స్కాలర్ టిమ్నిట్ గెబ్రూ గూగుల్ పబ్లిక్ ఇమేజ్ను మెరుగుకావడానికి దోహదపడ్డారు. అదే సమయంలో AI టెక్నాలజీలోని సమస్యలను ప్రశ్నించాడు. ఆ తర్వాత గెబ్రూ ఆ సంస్థ నుండి నిష్క్రమించారు. ఇది చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. ఆయన అకస్మికంగా బయటకు వెళ్లడం అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు. ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు. గెబ్రూ నిష్క్రమణకు దారితీసిన పరిస్థితుల గురించి గూగుల్ సమీక్షిస్తుందన్నారు. AIలో ప్రఖ్యాతిగాంచిన గెబ్రూను తొలగించారు. దీనిని గూగుల్ రాజీనామాగా పేర్కొంది.
గూగుల్ నుండి ఆ కీలక ఉద్యోగిని ఔట్, దుమారం
అందుకే సుందర్ క్షమాపణలు
గెబ్రూ తొలగింతపై క్షమాపణలు చెప్పిన సుందర్ పిచాయ్, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. 'గెబ్రూ తొలగింత తన దృష్టికి వచ్చింది' అని పిచాయ్ అన్నారు. 'ఈ తొలగింత ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. మరింత మంది ఉద్యోగులు ప్రశ్నించేందుకు తావిచ్చింది. దీని పట్ల నేను క్షమాపణ చెబుతున్నాను. మీ నమ్మకాన్ని పునరుద్ధరించే బాధ్యతను తీసుకుంటున్నాను' అని సుందర్ పిచాయ్ అన్నారు.
గెబ్రూ తొలగింత అనూహ్యం
పరిశోధన పత్రం విషయంలో సంస్థ మేనేజ్మెంట్కు, టిమ్నిట్కు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, అందుకే బయటకు వెళ్లారని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో రూపుదిద్దుకుంటున్న ఓ కొత్త విభాగం సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని టిమ్నిట్ లేవనెత్తారని, ఇదే వివాదానికి కారణమైందని వార్తలు వచ్చాయి. దీంతో ఆమె సంస్థ నుండి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తనను తొలగించినట్లు ట్విట్టర్ వేదిక ద్వారా గెబ్రూ ప్రకటించారు. గెబ్రూ రాజీనామా చేసినట్లు ఉద్యోగులకు కూడా గూగుల్ తెలిపింది. దీంతో వివాదం చెలరేగింది. గెబ్రూకు ఉద్యోగుల నుండి మద్దతు లభించింది. దాదాపు 1200 మంది ఉద్యోగులు ఆమెకు మద్దతుగా ఓపెన్ లెట్టర్ రాశారు. ఇది జాత్యాహంకార, రక్షణాత్మక చర్యగా కంపెనీని తప్పుబట్టారు. గెబ్రూ తొలగింపు అనూహ్యమని పేర్కొన్నారు. కంపెనీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధ్యత వహించాలన్న పిచాయ్
అపారమైన ప్రతిభ కలిగిన నల్లజాతి మహిళ గూగుల్ను అసంతృప్తికర పరిస్థితుల్లో వదిలి పెట్టినందుకు బాధ్యత వహించాలని సుందర్ పిచాయ్ అన్నారు. కంపెనీ నుండి గెబ్రూ ఆకస్మిక నిష్క్రమణ ఇప్పుడు గూగుల్ సంస్థ విశ్వసనీయతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.