Good News: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1,300 కంపెనీలపై నివేదిక.. ఆ విషయంలో టాప్ లో ఇండియా..
Good News: భారతీయ ఉద్యోగస్తులకు శుభవార్త. 2023లో ఉద్యోగుల జీతాల్లో రెండంకెల పెంపు ఉండవచ్చు. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అయాన్ తన నివేదికలో ఈ విషయాన్న వెల్లడించింది. కొవిడ్ మహమ్మారి తర్వాత కంపెనీలు తిరిగి వేగంగా పుంజుకుంటున్నందున.. 2023 వ్యాపార దృక్కోణం ఉత్సాహభరితంగా ఉంటుందని తన నివేదికలో వెల్లడించింది.
నివేదిక ప్రకారం..
గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ AON Plc భారతదేశంలో వేతన వృద్ధిపై సర్వే నిర్వహించింది. దేశంలోని కంపెనీలు 2023లో తమ వ్యాపారంలో బలమైన పనితీరును కనబరుస్తాయనే అంచనాల మధ్య ఉద్యోగుల జీతాన్ని 10.4 శాతం పెంచవచ్చు. ఫిబ్రవరి జీతాల్లో 9.9 శాతం పెరుగుదల అంచనా కంటే ఇది ఎక్కువగా ఉంది. అలాగే 2022లో జీతాల్లో 10.6 శాతం పెరుగుదల నమోదైంది.
1,300 కంపెనీల డేటా..
దేశంలోని 40కి పైగా పరిశ్రమలకు చెందిన 1,300 కంపెనీల డేటాను రీసెర్చ్ కోసం కంపెనీ విశ్లేషించింది. 2022 ప్రథమార్థంలో ఉద్యోగ నష్టం రేటు గరిష్ఠంగా 20.3 శాతంగా ఉందని పేర్కొంది. అందువల్ల జీతాలు పెంచాలని కంపెనీలపై ఒత్తిడి ఉంది. ఈ రేటు 2021లోని 21 శాతం కంటే ప్రస్తుతం తక్కువగా ఉంది.
భారత కంపెనీల్లో..
ప్రస్తుతం భారతీయ కంపెనీల్లో 'ది గ్రేట్ రిసిగ్నేషన్' యుగం నడుస్తోంది. 2022 తొలినాళ్లలో కంపెనీల్లో అట్రిషన్ రేటు 20.3%కు చేరుకుంది. 2020లో ఇది కేవలం 6% మాత్రమే. అంటే ఉద్యోగులు రాజీనామాలు ఇవ్వటం మూడింతలకు పైగా పెరిగింది.
జీతాలు ఎక్కువగా పెంపు..
ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను గమనిస్తే భారత్ చాలా మెరుగైన స్థితిలోనే ఉంది. అదే విధంగా ఉద్యోగులకు జీతాలు పెంచే విషయంలోనూ ప్రస్తుతం దేశీయ కంపెనీలు మెుదటి స్థానంలో ఉన్నాయి. 2022లో ఇప్పటివరకు అత్యధిక జీతాలు పెరిగిన ఏకైక దేశం భారతదేశం. జర్మనీ 3.5%, UK 4%, USA 4.5%, చైనా 6%, బ్రెజిల్ 5.6%, జపాన్ 3% మేర జీతాలు పెంచాయి. అయితే భారత్ లో మాత్రం జీతాలు 10.6% మేర పెరిగాయి.
ఈ రంగాల్లోని ఉద్యోగులకు అధిక పెంపు..
ఐదు రంగాల్లో పనిచేసేవారికి భారీగా జీతాల పెరుగుదల ఉండనున్నట్లు సర్వేలో తేలింది. వీటిలో నాలుగు టెక్నాలజీ సంబంధిత రంగాలు ఉన్నాయి.అయితే ఈ-కామర్స్ రంగంలోని ఉద్యోగుల జీతం అత్యధికంగా 12.8% పెరగవచ్చని అంచనాలు చెబుతున్నాయి. దీని తర్వాత స్టార్టప్లు 12.7%, హైటెక్/ఐటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కూడిన సేవలు 11.3%, ఆర్థిక సంస్థలు 10.7% జీతాలు పెరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం కారణంగా సవాళ్లు ఉన్నప్పటికీ.. దేశంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.