యువ నిపుణులకు సెబి ఆహ్వానం, నెలకు రూ.60,000 భృతి
సెక్యూరిటీ మార్కెట్ కార్యకలాపాలు, న్యాయ, ఐటీ, పరిశోధన వంటి వివిధ విభాగాల్లో యువ నిపుణులను భాగస్వాములను చేయడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి సన్నాహాలు చేస్తోంది. యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం కింద 38 మంది యువ నిపుణుల కోసం చూస్తోన్న సెబి దరఖాస్తులన్ని ఆహ్వానించింది. ఇలాంటి యువ నిపుణులకు నెలకు రూ.60,000 భృతిని అందిస్తుంది. భారత స్టాక్ మార్కెట్, నియంత్రణ సంస్థల పనితీరు గురించి నేర్చుకోవడానికి యువ నిపుణులకు యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం మంచి అవకాశమని తెలిపింది.
సెక్యూరిటీస్ మార్కెట్ కార్యకలాపాలు, న్యాయ, ఐటీ, పరిశోధన వంటి వివిధ విభాగాల్లో వేర్వేరు అర్హతలు కలిగిన వారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో చేరడానికి ఆసక్తి కలిగిన వారు ముప్పై ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. భారతీయులై ఉండాలి. అలాగే, 120 మంది సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్స్ కోసం సెబి దరఖాస్తుల్ని ఆహ్వానించింది.
ఇదిలా ఉండగా, 2019 మార్చి నుండి 2021 నాటికి డీమ్యాట్ ఖాతాలు రెట్టింపు అయినట్లు సెబి చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. 2019 మార్చి నాటికి 3.6 కోట్లుగా ఉన్న ఖాతాలు 2021 నవంబర్ నాటికి 7.7 కోట్లకు పెరిగాయన్నారు. నిఫ్టీ ఇండెక్స్ ప్రారంభించిన పాతికేళ్ల సందర్భంగా ఎన్ఎస్ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెరుగుతున్నట్లు తెలిపారు.