లాక్డౌన్ సమయంలో SBI కస్టమర్లకు శుభవార్త, జూన్ 30 దాకా ఊరట
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్న్యూస్. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలను ఎత్తివేసింది. ఎస్బీఐ ఏటీఎం సహా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి చేసే నగదు ఉపసంహరణపై ఛార్జీలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలో చేసిన ప్రకటన నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు చేసే ఉపసంహరణలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.
ఏ పరిస్థితులున్నా మీ ఉద్యోగాలు మీవే: ఉద్యోగుల తొలగింత, శాలరీ పెంపుపై TCS క్లారిటీ
నగదు ఉపసంహరణ
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి నగదును ఉపసంహరించుకున్న సందర్భాలలో కూడా ఎలాంటి ఛార్జీలు విధించవద్దని చెప్పారు. ఏటీఎం నుండి నగదు ఉపసంహరణపై నెలకు పరిమిత ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఈ పరిమితి మించినా ఛార్జీలు విధించవద్దని సూచించారు. డెబిట్ కార్డుదారులు కూడా ఇతర బ్యాంకు ఏటీఎంల నుండి నగదును ఉపసంహరించుకోవచ్చు.
ఎస్బీఐ ఉపసంహరణ పరిమితి
సాధారణంగ ఎస్బీఐ రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు ఎనిమిది ఉచిత ట్రాన్సాక్షన్స్ అందిస్తుంది. ఇందులో ఎస్బీఐ ఏటీఎంలలో 5 ట్రాన్సాక్షన్స్, ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు జూన్ 30 వరకు వెసులుబాటు కల్పించింది.
ఛార్జీలు ఇలా..
నాన్-మెట్రోలలో అకౌంట్ హోల్డర్స్కు 10 ఉచిత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇందులో 5 ఎస్బీఐ ఏటీఎం, మిగతా ఐదు ఇతర ఏటీఎంల నుండి తీసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే ఒక్కో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ.20 ప్లస్ జీఎస్టీ, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ.8 ప్లస్ జీఎస్టీ ఛార్జీ విధిస్తారు.
ఇదివరకే మినిమం బ్యాలెన్స్ పైన ఊరట
ఎస్బీఐ అంతకుముందే తన ఖాతాదారులకు ఓ ఊరట కల్పించింది. అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ నిబంధనను తాత్కాలికంగా ఎత్తివేయడం ద్వారా 44 కోట్ల మంది సేవింగ్ అకౌంట్ హోల్డర్లకు ప్రయోజనం కల్పించింది. ఇప్పుడు మరో ఉపశమన నిర్ణయం తీసుకుంది.