బంగారం ధరలు పెరిగాయి కానీ, రూ.12,000 తక్కువ: 2 నెలల్లో రూ.5,000 డౌన్
ముంబై: నిన్నటి వరకు భారీగా పతనమైన పసిడి ధరలు నేడు (మార్చి 9, మంగళవారం) ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగాయి. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం ఆర్థిక రికవరీపై ఆశలతో ఈ ఏడాది ఆరంభం నుండి పసిడి ధరలు తగ్గుతున్నాయి. 2021లో ఇప్పటి వరకు రూ.5,000 వరకు తగ్గాయి. కరోనా వ్యాక్సీన్ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టడం, కేంద్రబ్యాంకులు నిధులను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పరుగు పెడుతున్నాయి. ఈ ప్రభావం పసిడిపై పడుతోంది. పైగా బిట్ కాయిన్ మరో గోల్డ్గా అవతరించింది. దీంతో పసిడిపై పెట్టుబడులు తగ్గాయి. పసిడి ధర నిన్న రూ.500 వరకు తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.468 తగ్గి రూ.44,215 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.423 తగ్గి రూ.44,443 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. నిన్న మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.253 పెరిగి రూ.65,856 వద్ద, రూ.395 పెరిగి రూ.66,951 వద్ద ముగిసింది.
GST పరిధిలోకి వస్తే పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.68! కానీ నేతలు సిద్ధంగా లేరు
11 నెలల కనిష్టానికి సమీపంలో
గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.రూ.11,850 వరకు తక్కువగా ఉంది. దాదాపు 11 నెలల కనిష్టానికి సమీపంలో ఉంది.
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు ఉదయం సెషన్లో రూ.44,500 దిగువనే ఉంది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.113.00 (0.26%) పెరిగి రూ.44,331.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,349.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,387.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,310.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,000 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.153.00 (0.34%) పెరిగి రూ.44584.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,550.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,550.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
66వేలు దాటిన వెండి
వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.233.00 (0.35%) పెరిగి రూ.66085.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,177.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,272.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,066.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో రూ.331.00 (0.49%) పెరిగి రూ.67249.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,249.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,249.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,249.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఎలా ఉందంటే
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, 1700 డాలర్లకు దిగువనే ఉన్నాయి. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 8.75
(+0.52%) డాలర్లు పెరిగి 1686.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,676.85 - 1,688.55 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల వద్ద ఉంది. ఔన్స్ ధర 0.138 (+0.55%) డాలర్లు పెరిగి 25.402 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.095 - 25.503 డాలర్ల మధ్య కదలాడింది.