ఎంసీఎక్స్లో భారీగా పెరిగిన బంగారం ధర, హైదరాబాద్లో తగ్గుదల! ఆ మార్క్ వద్ద ఆగిపోవచ్చు..
బంగారం ధరలు బుధవారం (మే 20) రోజు పెరిగాయి. కరోనా మహమ్మారి, అంతర్జాతీయ పరిణామాలతో ధరలు ఎగిసిపడుతున్నాయి. ఉదయం ఎంసీఎక్స్లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.6 శాతం ఎగిసి 10 గ్రాములకు రూ.47,331 పలికింది. అంతకుముందు సెషన్లో రూ.435 పెరిగింది. గత ఆరు సెషన్లలో ఐదు సెషన్లలో బంగారం ధర పెరిగింది. గత వారం బంగారం ధరలు రూ.47,980 రికార్డ్ ధరకు చేరుకున్న విషయం తెలిసిందే. వెండి కిలో 1.17% పెరిగి రూ.49,390 పలికింది.
బంగారం ధర: కరోనా వ్యాక్సిన్ పరీక్షలు సక్సెస్ అయితే...!
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయంగా మార్కట్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 0.4 శాతం పెరిగి 1,753.30 డాలర్లు పలికింది. నిన్నటితో పోలిస్తే 19 డాలర్లు పెరిగింది. స్పాట్ గోల్డ్ 0.2 శాతం ఎగిసి ఔఐన్స్ 1,747.19 పలికింది.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉంటుందని వివిధ సంస్థలు అంచనా వేశాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్న బంగారం దిశగా చూస్తున్నారు. దీంతో పసిడి ధర రోజు రోజుకు పెరుగుతోంది. దేశీయ మార్కెట్ విషయానికి వస్తే వీటన్నింటికి తోడు రూపాయి బలహీనపడటం మరింత ధరల పెరుగుదలకు కారణమైంది. ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణి అవలంభించి బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారని, దీంతో ధరలు పుంజుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్లో తగ్గుదల.. ఐనా రూ.50,000కు సమీపంలో
హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.600 తగ్గింది. రూ.48,400 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 వరకు తగ్గి రూ45,360 పలికింది. వెండి రూ.వెయ్యికి పైగా పెరిగింది. బంగారం ధర రూ.50,000 సమీపంలో ఉంది.
1900 డాలర్ల దిశగా..
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం అస్థిరంగానే ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. 1785 డాలర్ల వద్ద ప్రతిఘటన ఎదుర్కోవచ్చునని, ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడి నుండి 1900 డాలర్ల దిశగా వెళ్లవచ్చునని చెబుతున్నారు.
అక్కడ ఆగిపోవచ్చు
2000 సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా బంగారంపై ఇన్వెస్టర్లు మరింత ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. కరోనా నుండి క్రమంగా కోలుకొని, ఆర్థిక వ్యవస్థలు తిరిగి కుదురుకునే సమయానికి బంగారం ధర 1900కు చేరుకున్నప్పటికీ, అక్కడ ఆగిపోవచ్చునని అంటున్నారు. అప్పటికి తిరిగి ఆర్థిక వ్యవస్థలు కోలుకునే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇక వెండి ధర అయితే అప్పటి నుండి పెరుగుతూ.. తగ్గుతూ ఉంది. 2000లో వెండి ధర ఔన్స్కు 5 డాలర్లు కాగా, 2011లో 50 డాలర్లకు కూడా చేరుకుంది. ఇప్పుడు 15 డాలర్లకు అటు ఇటుగా ఉంది.