3 నెలల కనిష్టానికి బంగారం ధరలు, ద్రవ్యోల్భణంతో పెరిగే ఛాన్స్!
బంగారం ధరలు నేడు(సోమవారం, 16 మే) పెరిగినప్పటికీ, రూ.50,000కు దిగువనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు 1810 డాలర్లకు దిగువన ఉన్నాయి. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్రమంగా బలపడుతోంది. ఇది పసిడి పైన ఒత్తిడిని కలిగిస్తోంది. అయితే ద్రవ్యోల్బణ ఆందోళనలు ఈ వారం పసిడికి సానుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదు. డాలర్ వ్యాల్యూ పెరుగుతుండటంతో బంగారం ధరలు ప్రస్తుతం మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి.
బంగారం వెండి ధరలు
ఎంసీఎక్స్లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో రూ.89 పెరిగి రూ.49,962 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.84 పెరిగి రూ.50,156 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే పసిడి రూ.6200 వరకు తక్కువగా ఉంది. వెండి ధరలు కూడా నేడు స్వల్పంగా పెరిగినప్పటికీ రూ.59,000కు దిగువనే ఉన్నాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.325 తగ్గి రూ.59,657 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్ రూ.229 పెరిగి రూ.60,250 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు నేడు స్వల్పంగా పెరిగినప్పటికీ 1800 డాలర్లకు కాస్త మాత్రమే పైన ఉన్నాయి. ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 2 డాలర్లు లాభపడి 1806 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.049 డాలర్లు ఎగిసి 21.050 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఈ సంవత్సరం 1.29 శాతం మేర క్షీణించగా, సిల్వర్ ఫ్యూచర్స్ 22.34 శాతం తగ్గింది.
అమెరికా డాలర్ ఎఫెక్ట్
అమెరికా డాలర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది. ఇది పసిడి పైన ప్రభావం చూపుతోంది. పసిడి ధరలు తగ్గుతుండటంతో డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ద్రవ్యోల్భణ భయాలు ధర పెరగడానికి కారణంగా మారవచ్చునని అంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పైన అందరి దృష్టి ఉంది. ఈ ప్రభావం కూడా పసిడి పైన ఉంటుంది.