Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర, రూ.51,000కు సమీపంలో
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్న రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య చర్చలు విఫలం కావడం, మరోసారి చర్చలకు ఇరువర్గాలు అంగీకరించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి పసిడి వైపు చూస్తున్నారు. దీంతో క్రితం సెషన్లో 1900 డాలర్ల పైన ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మరింత పెరిగి 1920 డాలర్లు క్రాస్ చేసింది. రష్యా పైన అమెరికా, యూరోపియన్ దేశాల ఆంక్షలు, పుతిన్ పైన యుద్ధ నేరాల అభియోగాలు ఉండవచ్చునని బ్రిటన్ హెచ్చరించిన నేపథ్యంలో మున్ముందు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో పసిడికి డిమాండ్ పెరుగుతోంది.
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 22.70 డాలర్లు లేదా 1.19 శాతం లాభపడి 19,23.40 డాలర్ల వద్ద ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.341 డాలర్లు లేదా 1.40 శాతం ఎగిసి 24.710 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం క్రితం సెషన్లో 1900 డాలర్ల వద్ద, సిల్వర్ 24.366 డాలర్ల వద్ద ముగిశాయి. నేడు గోల్డ్ ఓ సమయంలో 1929 డాలర్ల స్థాయికి చేరుకుంది.

ఇక నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్లకు సెలవు రోజు. నిన్న కూడా పసిడి, వెండి ఫ్యూచర్ భారీ లాభాల్లో ముగిసింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.594 పెరిగి రూ.50,815 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.620 పెరిగి రూ.50,981 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.873 ఎగిసి రూ.64,896 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1005 పెరిగి రూ.65,910 వద్ద ముగిసింది. పసిడి ధరలు పద్దెనిమిది నెలల గరిష్టాన్ని తాకాయి.


Click it and Unblock the Notifications