ఏప్రిల్ నెలలో దాదాపు 100 శాతం తగ్గిన బంగారం దిగుమతులు
బంగారం దిగుమతులు ఏప్రిల్ నెలలో దారుణంగా పడిపోయాయి. పసిడి దిగుమతులు పడిపోవడం ఇది వరుసగా ఐదో నెల. ఈ ఏప్రిల్లో దిగుమతులు 28.3 లక్షల కోట్ల డాలర్లు లేదా దాదాపు రూ.21 కోట్లకు పడిపోయాయి. గత ఏడాది (2019) ఇదే ఏప్రిల్ నెలలో 397 కోట్ల డాలర్లు లేదా రూ.29,775 కోట్ల విలువైన బంగారం దిగుమతులు దేశంలోకి వచ్చాయి. ఈ లెక్కన దాదాపు వంద శాతం పడిపోయాయి.
భారీగా పెరుగుతున్న బంగారం ధర: ఆ తర్వాత ధర ఆగిపోతుందా! 'ఒత్తిళ్లు' సహా కారణాలివే?
పసిడి దిగుమతి ఎఫెక్ట్.. దిగివచ్చిన వాణిజ్యలోటు
బంగారం దిగుమతులు గత ఐదు నెలలుగా భారీగా పడిపోవడం దేశీయ వాణిజ్య లోటు 1533 కోట్ల డాలర్ల నుండి 680 కోట్ల డాలర్లకు దిగి వచ్చింది. ఇదే సమయంలో ముత్యాలు, ఆభరణాల ఎగుమతులు కూడా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 360 లక్షల డాలర్లు లేదా దాదాపు రూ.270 కోట్లకు పరిమితమయ్యాయి. 2019 డిసెంబర్ నుండి కూడా పసిడి దిగుమతులు తగ్గుతున్నాయి. 2019-20లో 2,820 కోట్ల డాలర్ల విలువైన పసిడి దిగుమతి అయింది. 2018-19లో ఇది 3,291 కోట్ల డాలర్లుగా ఉంది.
98.74 శాతం పడిపోయిన దిగుమతి
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ముందుంటుంది. మన వద్ద బంగారు ఆభరణాలు ధరించడం ఎక్కువ. దీంతో దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. వ్యాల్యూమ్ టర్మ్లో బంగారం దిగుమతులు ఏడాదికి 800 టన్నుల నుండి 900 టన్నుల మధ్య ఉంటుంది. కానీ ఏప్రిల్ నెలలో ఇది 98.74 శాతం (దాదాపు 100 శాతానికి సమీపం) పడిపోయి 36 మిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంది.
దిగుమతులు తగ్గడానికి కారణాలు ఎన్నో
బంగారం ధరలు అస్థిరంగా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్ కాస్త తగ్గింది. దీంతో దిగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయి. గత మూడు నెలలుగా కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా సేల్స్ లేవు. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉండటం, చమురు మార్కెట్ దారుణంగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నారు. దీంతో బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఎగుమతులు, దిగుమతులపై కూడా ఆంక్షలు ఉన్నాయి. ఇలా వివిధ కారణాల వల్ల దిగుమతులు తగ్గాయి.