Pakistan Crisis: లీటర్ పెట్రోల్ రూ.272.. IMF సాయం పాక్ను కాపాడలేదా..? సంచలన రిపోర్ట్
Pakistan Crisis: పాకిస్థాన్ లో పరిస్థితులు దారుణాతిదారుణంగా ఉన్నాయి. అసలు అక్కడి ప్రజలు ఏం తింటున్నారు. ఎలా జీవిస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ద్రవ్యోల్బణం ఎఫెక్ట్..
ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం దాదాపు 33 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. కొత్త ధరలు ఫిబ్రవరి 17 నుంచి అమలులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఫారెక్స్ రిజర్వ్ దాదాపుగా ఖాళీ అయ్యాయి. దీంతో ఆహార పదార్థాల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల వరకు పాకిస్థాన్ దిగుమతులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రేపటి నుంచి లీటరు పెట్రోల్ ధర రూ.272, లీటరు డిజిల్ ధర రూ.196కి చేరుకోగా.. స్పీడ్ డీజిల్ లీటరు ధర రూ.280కి చేరుకుంది. ఇక లీటరు కిరోసిన్ ధర చూస్తే రూ.202.73కి చేరింది.
గ్యాస్ ధరలు..
ప్రజలకు చాలా ముఖ్యమైన గ్యాస్ ధరలు సైతం ఆకాశాన్ని అంటాయి. పైగా గృహ వినియోగదారులకు గ్యాస్ ధరను 112 శాతం పెంచాలని ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. ఇక కమర్షియల్ సిలిండర్ ధరలను సైతం 29 శాతం మేర పెంచారు. గోధుమ పిండి కిలో రూ.120, బియ్యం కిలో రూ.200, పాలు లీటరు రూ.210, బంగాళదుంప కిలో రూ.70, టమాటా కిలో రూ.130, చికెన్ కిలో రూ.780కి అమ్ముడవుతున్నాయి. ఈ తరుణంలో అప్పుకోసం ఐఎంఎఫ్ షరతులను అంగీకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంది.
మూడీస్ నివేదిక..
అయితే పాక్ ఆర్థిక పరిస్థితికి ప్రమాద ఘంటికలు మోగించనుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నివేదించింది. సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్లోని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేక దేశాలకు చేరువైంది. కానీ అన్ని వైపుల నుంచి వారికి నిరాశే ఎదురైంది. 2019లో పాక్ 6 బిలియన్ డాలర్లను IMF నుంచి పొందేందుకు బెయిలవుట్ ప్యాకేజీపై సంతకం చేసింది. ఆ నిధులు ప్రస్తుతం విడుదల కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి బెయిలవుట్ నిధులు ఏమాత్రం సరిపోవని మూడీస్ అంచనా వేసింది.
అప్పుల కుప్పలు..
రాబోయే కొన్నేళ్లపాటు దేశాన్ని నడపడానికి నిధులను కూడగట్టుకునే పాకిస్థాన్ సామర్థ్యం కూడా ప్రమాదంలో పడింది. ప్రస్తుతం దాయాది రుణాలు మెుత్తంగా 60 ట్రిలియన్ పాకిస్థాన్ రూపాయల కంటే ఎక్కువకు చేరుకుంది. ఇవి పాక్ జీడీపీలో దాదాపు 89 శాతానికి సమానవైనవి. శ్రీలంక మాదిరిగానే పాకిస్థాన్ అప్పుల్లో సింహభాగం చైనాకు చెల్లించాల్సినవే. ఈ పరిస్థితులను చూసిన చైనా సైతం ఆందోళన చెందుతోంది.
ప్రజలు పారిపోవాల్సిందే..
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పాక్ పరిస్థితి చూస్తుంటే 2022లో శ్రీలంక విషయంలో జరిగిందే కనిపిస్తోందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో అక్కడి ప్రజలు దేశం వదిలి పారిపోవడం ప్రారంభించారు. పాకిస్థాన్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఒక్కసారిగా పెరుగుతోంది. 2022లో పాకిస్తాన్లో 8,32,339 మంది దేశం విడిచిపెట్టారు. గణాంకాల ప్రకారం గత ఏడాది పాక్ విడిచి వెళ్లిన పౌరుల సంఖ్య దాదాపు 200% పెరిగింది.