ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే భారత్ చాలా బెట్టర్: ఆర్బీఐ నివేదిక
ప్రపంచంతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ బాగుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్థిక నివేదిక తెలిపింది. కరోనా సంక్షోభం నుండి కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం గణనీయంగా తగ్గనుందని అంచనా వేసింది. ఈ మేరకు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది. కరోనా మహమ్మారి తర్వాత రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక అవాంతరాలు ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్గా మారాయని తెలిపింది.
ముడి సరుకుల కొరత, ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందుల వంటి సమస్యలు తిరిగి జఠిలమవుతున్నట్లు తెలిపింది. కరోనా వ్యాప్తి, చైనాలో లాక్ డౌన్, ప్యారిస్ పర్యావరణ లక్ష్యాలు ఆర్థిక వ్యవస్థ మందగమనానికి మరిన్ని కారణాలు ఉన్నాయని తెలిపింది. ఇన్ని అంతర్జాతీయ ప్రతికూలతల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉందని ఆర్బీఐ పేర్కొంది.
ఫలితంగా పునరుత్తేజం బలంగానే ముందుకు సాగుతోందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేసే ఇతర అంశాలు క్రమంగా బలపడనున్నాయని తెలిపింది. మరోవైపు వృద్ధికి ఊతమివ్వాల్సిన తరుణంలో ద్రవ్యోల్భణం ఎగబాకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సవరించవలసి వస్తోందని వెల్లడించింది. ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ ఇటీవల రెపో రేటు పెంచిన విషయం తెలిసిందే.