తొలి త్రైమాసికంలో జీడీపీ నష్టం రూ.6 లక్షల కోట్లు, ఎస్బీఐ రీసెర్చ్
ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ కారణంగా భారత జీడీపీ నష్టం రూ.6 లక్షల కోట్ల వరకు ఉంటుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. అయితే వాస్తవిక నష్టం రూ.4 లక్షల కోట్ల నుండి రూ.4.5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం వృద్ధిరేటు 1.3 శాతం, మొత్తం ఆర్థిక సంవత్సరానికి మైనస్ 7.3 శాతం క్షీణత ఉండవచ్చునని తెలిపింది. అంతకుముందు 7.4 శాతంగా అంచనా వేసింది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే భారత వృద్ధి రేటు అంచనాలను వరుసగా 7.3 శాతం, 2 శాతంగా అంచనా వేసింది.
ఊరట: మరో ఉద్దీపన ప్యాకేజీకి సిద్ధమవుతోన్న కేంద్ర ప్రభుత్వం, ఈ రంగాలకు ప్యాకేజీ
సెకండ్ వేవ్ ప్రభావం
కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకు నాలుగు దశల్లో దేశవ్యాప్తంగా కఠిన లాక్ డౌన్ అమలు చేశారు. దీంతో గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 24.4%, రెండో త్రైమాసికంలో మైనస్ 7.3% నమోదయింది. లాక్ డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకున్న నేపథ్యంలో మూడో త్రైమాసికంలో 0.4%తో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ త్రైమాసికంపై ప్రభావం పడనుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది.
నష్టం ఎంతంటే
ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం ఇప్పటికే జీడీపీ గణాంకాలను ప్రకటించిన 25 దేశాల లెక్కలను పరిశీలిస్తే వేగంగా అభివృద్ధి చెందిన దేశాల వరుసలో భారత్ అయిదవ స్థానంలో నిలవనుంది. కఠిన లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నామినల్ జీడీపీ 2020-21 మొదటి త్రైమాసికంలో రూ.11 లక్షల కోట్లను నష్టపోయింది. అయితే 2021-22 మొదటి త్రైమాసికంలో ఈ నష్టం రూ.6 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.
వృద్ధి అంచనాల్లో కోత
భారత ఆర్థిక వ్యవస్థ 2021-22 వృద్ధి తొలి అంచనాల్లో బార్క్లేస్ కూడా కోత విధించిన విషయం తెలిసిందే. అంతకుముందు అంచనాలకు 80 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.2 శాతానికి తగ్గించింది. థర్డ్ వేవ్ సంక్షోభం తలెత్తి లాక్ డౌన్ మరో కొనసాగడం, వ్యాక్సినేషనలో ఆలస్యం వంటి సవాళ్లు తలెత్తితే వృద్ధి రేటు 7.7 శాతానికి పడిపోతుందని కూడా అంచనా వేసింది. తొలుత ఊహించిన దానికన్నా తీవ్రంగా సెకండ్ వేవ్ సవాళ్లు ఉన్నాయని పేర్కొంది.