ముంబై: కరోనా-లాక్ డౌన్ సంక్షోభం కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు నెగిటివ్గా ఉండవచ్చునని అంచనా వేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మరిన్ని చర్యల ప్రకటనలో భాగంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక రంగం కుదేలయిందన్నారు. ఎగుమతుల వృద్ధికి తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆహార ద్రవ్యోల్భణం ఏప్రిల్లో 8.6 శాతం పెరిగిందన్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి 3.7 శాతం వృద్ధి సాధించిందన్నారు. వ్యవసాయ రంగ ఉత్పత్తిలో పెరుగుదల ఉందన్నారు.

పెరిగిన విదేశీ మారకపు నిల్వలు
ఇండియా విదేశీ మారక నిల్వలు 9.2బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఇండియా ఎగుమతులు 60.5 శాతం మేర తగ్గిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. దేశంలో ఆహార భద్రతకు భరోసా ఉందని చెప్పారు. ద్రవ్యోల్భణం అంచనా వేయడం చాలా క్లిష్టంగా మారిందని చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలపై ద్రవ్యోల్భణం ఆధారపడి ఉంటుందన్నారు. ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ నెలలో తయారీ రంగంలో ఎన్నడూ లేనంత క్షీణత నమోదయిందన్నారు.

మారటోరియం మరో 3 నెలలు పొడిగింత
టర్మ్ లోన్లపై మరో మూడు నెలలపాటు మారటోరియం పొడిగిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. అంటే ఈఎంఐలపై వెసులుబాటు కల్పిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుండి ఆగస్ట్ 31వ తేదీ వరకు మారటోరియంను పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇదివరకు మార్చి నుండి మే వరకు మారటోరియం ఇచ్చిన ఆర్బీఐ.. ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించింది. సిడ్బి రుణాల మారటోరియంను 90 రోజులు పొడిగిస్తున్నామని తెలిపారు.

నిధులు అందుబాటులో ఉంచేందుకు
మరిన్ని నిధులను వ్యవస్థలో అందుబాటులో ఉంచేందుకు రెపో రేటును తగ్గించినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ప్రస్తుతం ఉన్న 4.4 శాతం నుండి 4 శాతానికి పరిమితమవుతోంది. రివర్స్ రెపో రేటును 3.2 శాతానికి తగ్గించారు. రెపో రేటు తగ్గింపు ప్రయోజనాలను బ్యాంకులు కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications