Q4లో జీడీపీ వృద్ధి రేటు 1.6 శాతం, FY21లో మైనస్ 7.3 శాతం
గత పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను (2020-21) భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 7.3 శాతం నమోదయింది. అలాగే, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 1.6 శాతం సానుకూల వృద్ధి నమోదు చేసింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుండి లాక్ డౌన్ విధించడంతో FY21లో మొదటి మూడు నెలలు ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్ 23.9 శాతం నమోదయింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటోంది.
కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై భారీగానే పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3 శాతం క్షీణత నమోదు కావడం నాలుగు దశాబ్దాల చరిత్రలో ఇదే కనిష్ఠం. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం సంబంధిత గణాంకాలను వెలువరించింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో 0.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో మూడు శాతం వృద్ధి నమోదయింది.
చైనా జనవరి-మార్చి త్రైమాసికంలో 18.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అంతకుముందు ఏడాది (2019-20) ముఖ్యంగా తయారీ, నిర్మాణ రంగాల్లో స్తబ్దత కారణంగా దేశ జీడీపీ 4.2 శాతానికే పరిమితమయింది. ఇది 11 ఏళ్ల కనిష్ఠం.