ప్రపంచంలోనే దారుణ పతనం.. గౌతమ్ అదానీ సంపద ఎంత మేర క్షీణించిందంటే?
భారత రెండో కుబేరుడు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఇటీవల ఆసియా రెండో అతిపెద్ద ధనికుడిగా నిలిచారు. గత ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్లూ భారీగా ఎగిసిపడ్డాయి. గత ఏడాదిలో ఏ మేరకు లాభపడ్డాయో ఎన్ఎస్డీఎల్ ఇష్యూ తర్వాత ఈ వారంలో అంతేస్థాయిలో కుప్పకూలాయి. దీంతో కేవలం నాలుగు సెషన్లలో స్టాక్స్ పతనం కావడంతో వందల కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. దీంతో గౌతమ్ ఆదానీ సంపద, అదానీ గ్రూప్ సంపద కరిగిపోయింది. అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టపోవడంతో ఈ 58 ఏళ్ల బిలియనీర్ అదానీ సంపద నాలుగు రోజుల్లో 14 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది.
రెండు నుండి మూడుకు పడిపోయిన అదానీ
గత ఏడాది కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్జించిన వారిలో గౌతమ్ అదానీ ముందు నిలిచారు. కానీ ఇటీవల ఆయన సంపద అంతే స్థాయిలో ప్రపంచంలోనే ఈ వారంలో అత్యంత సంపద కోల్పోయిన వ్యాపారవేత్తగా నిలిచారు. ఆయన సంపద ఏకంగా రూ.67 కోట్ల మేర క్షీణించింది. దీంతో ఆయన సంపద రూ.5,00,240 కోట్లకు తగ్గింది. ప్రపంచ కుబేరుల్లో అత్యధికంగా నష్టపోయింది అదానీయే. దీంతో ఆయన ఆసియా ధనికుడి స్థానంలో రెండు ముండు మూడుకు పడిపోయారు.
ఆసియా టాప్ 3 వీరే
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో చైనా పారిశ్రామికవేత్త జాంగ్ షాన్షాన్ రెండో స్థానానికి ఎగబాకారు. అదానీ మూడో స్థానానికి పడిపోయారు. చైనా పారిశ్రామికవేత్త సంపద 6940 కోట్ల డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ సంపద 6760 కోట్ల డాలర్లు కాగా, ముఖేష్ అంబానీ ఆస్తి 8450 కోట్ల డాలర్లు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఈ వారంలో వరుసగా నష్టాపోయాయి. దాంతో గ్రూప్ మొత్తం మార్కెట్ వ్యాల్యూ గత రోజుల్లో రూ.1.59 లక్షల కోట్ల మేర తగ్గింది.
షేర్లు డౌన్
ఈ నెల 11వ తేదీన అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ వ్యాల్యూ రూ.9.51 లక్షల కోట్లు కాగా, 17వ తేదీ నాటికి రూ.7.92 లక్షల కోట్లకు పడిపోయింది. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీల షేర్లు ఈ నాలుగు రోజులు లోయర్ సర్యూట్ను తాకాయి. ఈ వారంలో గ్రూప్ షేర్లు 9 శాతం నుంచి 22 శాతం వరకు నష్టపోయాయి.