LPG Cylinder: సామాన్యులకు గుదిబండగా గ్యాస్.. ఒకేసారి రూ.1,050 పెంపు.. ఇలా అయితే కష్టమే..
LPG Cylinder: పెరుగుతున్న చుమురు, గ్యాస్ ధరలు భారతీయుల నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లపై అందిస్తున్న సబ్సిడీలను నిలిపివేయగా.. తాజాగా వ్యాపారులపైనా భారం పడటం ప్రారభమైంది. దేశీయ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ సెక్యూరిటీ డిపాజిట్ను పెంచిన తర్వాత.. గ్యాస్ కంపెనీలు వాణిజ్య LPG కనెక్షన్ల రేట్లను భారీగా పెంచాయి. పెరిగిన కొత్త రేట్లు ఈ రోజు(జూన్ 28, 2022) నుంచి అమలులోకి వచ్చాయి.
19 కిలోల సిలిండర్ డిపాజిట్ రేట్లు ఇలా..
కంపెనీలు ప్రకటించిన కొత్త ధరల ప్రకారం.. ఇకపై వాణిజ్య వినియోగదారులు 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై రూ.1,050 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ కనెక్షన్ ధరను ఇంతకు ముందు ఉన్న రూ.2,550 నుంచి రూ.3,600కి పెంచాయి. 47.5 కిలోల కమర్షియల్ సిలిండర్ కోసం ఇకపై కస్టమర్లు రూ.7,350 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దీని ధర రూ.6,450గా ఉండేది.. తాజాగా రెటు పెంపు వల్ల రూ.900 పెంపు జరిగింది.
ఎల్పీజీ కనెక్షన్లకు వన్-టైమ్ సెక్యూరిటీ..
అంతేకాకుండా.. LOT వాల్వ్తో కూడిన 19 కిలోల సిలిండర్ డిపాజిట్ రూ. 4,800 నుంచి రూ.5,850కు పెరిగింది. అదేవిధంగా.. LOT వాల్వ్తో కూడిన 47.5 కిలోల సిలిండర్ పై సెక్యూరిటీ డిపాజిట్ రూ.8,700 నుంచి రూ.9,600కు పెరిగింది. దీనికి ముందు కంపెనీలు జూన్ 16న దేశీయ ఎల్పీజీ కనెక్షన్లకు వన్-టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ను రూ.750 మేర పెంచాయి. రూ.1,450గా ఉండాల్సిన డిపాజిట్ రేటును రూ.2,200కి చమురు కంపెనీలు పెంచేశాయి.
రెండవ సిలిండర్ కోసం ఇలా..
ప్రస్తుతం కొత్త కనెక్షన్పై రెండు సిలిండర్ల సెక్యూరిటీ డిపాజిట్ రూ.4,400లుగా ఉంది. అదే 5 కిలోల సిలిండర్కు సెక్యూరిటీ డిపాజిట్ రూ.800 నుంచి రూ.1150కి పెంచటం జరిగింది. అంతేకాకుండా ఇకపై వినియోగదారులు గ్యాస్ పైపులకు రూ.150, పాస్బుక్కు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.