Petrol, diesel prices today: 22వ రోజు స్థిరంగా పెట్రోల్ ధరలు,
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 22వ రోజు శుక్రవారం(నవంబర్ 26) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. కొద్ది రోజుల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ధరలు తాము తగ్గించేది లేదని చెబుతున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. కేంద్రం తగ్గింపుకు రాష్ట్రాల వ్యాట్ తగ్గింపు తోడు కావడంతో పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.17 వరకు తగ్గింది. పెట్రోల్, డీజిల్ ధరలు పలు నగరాల్లో రూ.100 దిగువకు వచ్చాయి. ఢిల్లీ (రూ.94.14), కోల్కతా (రూ.89.79), చెన్నై (రూ.91.43), భోపాల్ (రూ.90.87లలో డీజిల్ ధర రూ.100 లోపు ఉంది. కేంద్రం తగ్గింపు తర్వాత పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. కానీ చత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వ్యాట్ తగ్గించలేదు.
అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.108.20, లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది. విజయవాడలో నేడు ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. లీటర్ పైన 57 పైసలు క్షీణించి రూ.110.36, లీటర్ డీజిల్ పైన 0.51 పైసలు తగ్గి రూ.96.45గా ఉంది.
అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశముంది. యూరోపియన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడం, జపాన్, భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు ఉండటం, ఈ దేశాల్లో ఓవర్-సప్లై, బలహీనమైన డిమాండ్ ఉండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నాయి.
బ్రెంట్ క్రూడ్, యూఎస్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 78 డాలర్ల దిగువకు వచ్చింది. అక్టోబర్ నుండి ఈ స్థాయికి రావడం ఇదే మొదటిసారి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధర ధర 78.39 డాలర్ల దిగువకు వచ్చింది.
ఇదిలా ఉండగా, చమురు ధరలకు చెక్ పెట్టి, ఉత్పత్తిని పెంచేందుకు చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ నిరాకరించడంతో, చమురు వినియోగ దేశాలన్నీ ఒక్కటి అవుతున్నాయి. తమ వ్యూహాత్మక నిల్వల నుండి ముడి చమురును బయటికి తీసేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా వచ్చే కొద్దినెలల్లో అమెరికా మాత్రమే తన 72.7 కోట్ల బ్యారెల్స్ వ్యూహాత్మక నిల్వల నుండి 5 కోట్ల బ్యారెల్స్ ముడి చమురును మార్కెట్లో విక్రయించనుంది. భారత్ కూడా తన 3.8 కోట్ల బ్యారెల్స్ క్రూడ్ నిల్వల నుండి 50 లక్షల బ్యారెల్స్ ముడి చమురును బయటికి తీయనుంది. అవసరమైతే మరింత చమురును ఈ నిల్వల నుండి అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెబుతున్నారు.