12 రోజులుగా జంప్: ఈ నగరాల్లో రూ.90 దాటిన పెట్రోల్ ధర, ఇక్కడే ఎందుకంటే
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల్లో నేడు మార్పులేదు. అయితే భోపాల్ వంటి పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.90ని దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.82.34, లీటర్ డీజిల్ ధర రూ.72.42గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.90కి సమీపంలో ఉంది. లీటర్ పెట్రోల్ రూ.89.02, డీజిల్ రూ.78.97 గా ఉంది. గత 12 రోజుల్లో చమురు ధరలు 12సార్లు పెరిగాయి. ఈ కాలంలో పెట్రోల్ ధరలు రూ.1.28, డీజిల్ ధర రూ.1.96 పెరిగింది.
మనీ ట్రాన్సుఫర్ చేసేవారికి గుడ్న్యూస్, డిసెంబర్ 1 నుండి అమల్లోకి...
2 నెలల విరామం తర్వాత..
రెండు రోజుల క్రితం ఆదివారం పెట్రోల్ ధర 21 పైసలు, డీజిల్ 29 పైసలు పెరిగింది. కరోనా వ్యాక్సీన్ పైన సానుకూల ప్రకటనల నేపథ్యంలో చమురు డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దాదాపు రెండు నెలల విరామం అనంతరం నవంబర్ 20వ తేదీ నుండి కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి.
నవంబర్ 22వ తేదీకి ముందు... సెప్టెంబర్ 22వ తేదీన పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు మార్పులేదు. డీజిల్ ధర అక్టోబర్ 2వ తేదీన పెరిగింది. ఆ తర్వాత మార్పులేదు. అనంతరం నవంబర్ 20వ తేదీ నుండి పెరుగుదలను నమోదు చేశాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
డిసెంబర్ 1న దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.34, ముంబైలో రూ.89.02, చెన్నైలో రూ.85.31, కోల్కతాలో రూ.83.87, హైదరాబాద్లో రూ.85.64, బెంగళూరులో రూ.85.09, గురుగ్రామ్లో రూ.80.56, నోయిడాలో రూ.82.62గా ఉంది.
డీజిల్ ధర విషయానికి వస్తే లీటర్ ఢిల్లీలో రూ.72.42, ముంబైలో రూ.78.97, చెన్నైలో రూ.77.84, కోల్కతాలో రూ.75.99, హైదరాబాద్లో రూ.79.02, బెంగళూరులో రూ.76.77, గురుగ్రామ్లో రూ.72.99, నోయిడాలో రూ.72.83గా ఉంది.
ఈ నగరాల్లో రూ.90 క్రాస్
నవంబర్ 30న భోపాల్లో పెట్రోల్ ధర రూ.90 దాటింది. లీటర్ ధర రూ.90.05గా ఉంది. డీజిల్ ధర రూ.80.10గా ఉంది. ఇండోర్లోను రూ.90 దాటి రూ.90.16, ఔరంగాబాద్లో రూ.90.25గా ఉంది.
పెట్రోల్ ధర రూ.90 దాటిన నగరాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) ఇక్కడ 39 శాతం ఎక్కువ అని, అందుకే రూ.90ని క్రాస్ చేసిందని చెబుతున్నారు.