అక్కడ పెరుగుతున్న ధరలు, భారత్లో పెట్రోల్, డీజిల్పై ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా గత పదిరోజులుగా ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదు. బ్రెంట్ క్రూడ్ ధర నిన్న పద్దెనిమిది నెలల గరిష్టానికి చేరుకొని బ్యారెల్కు 70 డాలర్లు దాటింది. నేడు మాత్రం కాస్త చల్లబడ్డాయి. బ్రెంట్తో పాటు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ కూడా పెరిగింది. ధరలు ఇలాగే పెరుగుతూ వెళ్తే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పైన ప్రభావం పడనుంది. ఇప్పటికే దేశీయంగా ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రూ.100ను క్రాస్ చేసింది.
ధరల ప్రభావం
దేశీయ మార్కెట్లో ఆల్టైం రికార్డుకు ఎగిసిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు ఇప్పటికే చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రూ.100 దాటగా, అన్ని మెట్రో నగరాల్లో, దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో సెంచరీకి సమీపంలో ఉంది. గతనెలలో వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు 10 రోజులుగా యథాతథంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నిన్నటి వరకు ధరలు పెరగడం దేశీయ మార్కెట్ల పైన ప్రభావం పడుతుందనే ఆందోళన కనిపించింది. అయితే నేడు అక్కడ తగ్గడం కాస్త ఊరట కలిగించే అంశం. సోమవారం నాటికి హైదరాబాద్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ రూ.94.79, డీజిల్ రూ.88.86గా ఉంది.
459 శాతం పెరిగింది
పెట్రోల్, డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు చమురురంగ కంపెనీలు లీటర్ పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.11 మేర పెంచాయి. 2013లో పెట్రోల్, డీజిల్పై విధించిన దిగుమతి సుంకాల వల్ల కేంద్రానికి రూ.52,537 కోట్ల ఆదాయం వచ్చిందని సోమవారం పార్లమెంటులో తెలిపారు. ఏడేళ్లలో వంట గ్యాస్ ధర రెట్టింపు అయి రూ.819లకు చేరుకుంది. పెట్రోల్, డీజిల్ దిగుమతిపై విధించిన సుంకాలతో ప్రభుత్వాదాయం 459 శాతానికి పైగా పెరిగిందని చెప్పారు.
దిగుమతి సుంకాల వల్ల
2019-20లో పెట్రోల్, డీజిల్పై విధించిన దిగుమతి సుంకాల వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.2.13 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. గత 11 నెలల్లో రూ.2.92 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2013తో పోలిస్తే 2019-20లో దాదాపు 5.6 రెట్లు ఆదాయం వచ్చింది.