Swiggy, Zomato: అలా చేయకపోతే లైసెన్స్ క్యాన్సిల్: కేంద్రం కొత్త నిబంధన: 1 నుంచే అమలు
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లల్లో వసూలు చేసే సర్వీస్ ఛార్జీలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే చర్యలకు దిగింది. ఇష్టానుసారంగా వసూలు చేస్తోన్న సర్వీస్ ఛార్జీలపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో వాటిని నియంత్రించే దిశగా అడుగులు వేసింది. త్వరలోనే మార్గదర్శకాలను తీసుకుని రానుంది.
అన్ని ఫుడ్ డెలివరీ యాప్స్పై..
ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ కార్యకలాపాలనుపైనా దృష్టి పెట్టింది. స్విగ్గి, జొమాటొ, డుంజో, ఫుడ్ పండా, ఉబేర్ ఈట్స్, బాక్స్8, ఫ్రెష్ మెనూ, ఫాసో, స్కూట్సీ.. వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున అందిన ఫిర్యాదులపై స్పందించింది.
న్యూట్రీషన్ వేల్యూస్ తెలిసేలా..
ఆయా కంపెనీలు వినియోగదారులకు డోర్ డెలివరీ చేసే ఆహార పదార్థాలకు సంబంధించిన పౌష్టిక వివరాలను తప్పనిసరిగా డిస్ప్లే చేయాలని ఆదేశించింది. జులై 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) దేశంలోని అన్ని ఇ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్కు ఉత్తర్వులను జారీ చేసింది.
మెనూ లేబ్లింగ్ కూడా..
మనం ఆర్డర్ ఇచ్చే ఆహార పదార్థంలో ఎన్ని కెలోరీలు ఉంటాయి?, పోషక విలువల శాతం ఎంత అనేది తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనతోపాటు- మెను కూడా లేబ్లింగ్ చేయాల్సి ఉంటుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ చీఫ్ అరుణ్ సింఘాల్ తెలిపారు. ఏ రకమైన ఆహారాన్ని వినియోగదారులు ఆర్డర్ ఇచ్చారనే విషయాన్ని తెలుసుకోవడానికే దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.
తప్పనిసరిగా..
సాధారణంగా ఆహార పదార్థాల ప్యాకింగ్పై పోషక విలువలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కూరలుగా తెప్పించుకున్న వాటిపై అలాంటి వివరాలేవీ ఉండవు. ఓ కవర్లో వాటిని డెలివరీ చేస్తుంటాయి మనం ఆర్డర్ చేసిన హోటళ్లు గానీ రెస్టారెంట్లు గానీ. అలా కవర్లో పెట్టి పంపించిన ఆహార పదార్థల పోషక విలువలు కూడా తెలియజేసేలా.. మెనూను కూడా లేబ్లింగ్ చేయాల్సి ఉంటుందని అరుణ్ సింఘాల్ చెప్పారు.
1వ తేదీ నుంచే..
కొత్త నిబంధనలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని అన్నారు. వాటిని అమలు చేయని రెస్టారెంట్లు, హోటళ్ల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. తొలుత షోకాజ్ నోటీసులను జారీ చేస్తామని, అప్పటికి వినకపోతే లైసెన్స్ రద్దు తప్పదని అన్నారు. పోషక విలువలు, మెను లేబ్లింగ్ లేని ఆహార పదార్థాలను డెలివరీ చేయొద్దంటూ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్కు ఆదేశాలను జారీ చేస్తామని చెప్పారు.
భారీగా కంప్లైట్లు..
ఏడాది కాలంలో నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్కు వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. స్విగ్గీ- 3,631, జొమాటో-2,828 ఫిర్యాదులు అందాయి. మిగిలిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఆపరేటర్లపైనా పెద్ద ఎత్తున కంప్లైట్స్ వచ్చాయి. డెలివరీతో పాటు ప్యాకేజింగ్ చార్జీలను వసూలు చేయడం, అదనపు పన్నులను వినియోగదారులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆర్డరుపై 20 శాతం కమీషన్ను తీసుకుంటున్నాయని, డెలివరీ ఛార్జీలను ఇష్టానుసారంగా బిల్లింగ్లో వేస్తున్నాయంటూ ఫిర్యాదులు అందినట్లు వివరించారు.