భారత్లోకి FPIలు అదుర్స్, 24 రోజుల్లో రూ.60,094 కోట్లు
భారత్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుండి 24వ తేదీ మధ్య రూ.60,000 కోట్లకు పైగా ఫారన్ పోర్ట్పోలియో ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టారు. అక్షరాలా రూ.60,094 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో ఈక్విటీలలో రూ.56,643 కోట్లు, డెబిట్లో రూ.3,451 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్ నెలలో మొత్తం రూ.62,951 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అమెరికా ఎన్నికలు, ఫలితాల అనంతరం దేశంలోకి FPI ఇన్-ఫ్లో భారీగా పెరిగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ వినోద్ నాయర్ అన్నారు.
భారత్లోకి పెట్టుబడులు
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి FPIలు పడిపోయాయి. రిస్క్ కారణంగా అన్-లాక్ తర్వాత కూడా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్స్ను హోల్డ్లో పెట్టారు. అయితే అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత్లో కరోనా కేసులు వేగంగా తగ్గిపోవడం, రికవరీలు వేగంగా పెరగడం వంటి వివిధ కారణాలతో గత కొద్ది నెలలుగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ పెట్టుబడులపరంగా లబ్ధి చేకూరుతోందని అంటున్నారు.
చైనాను మినహాయిస్తే...
పన్ను సంస్కరణలు, కోవిడ్ 19, PLI, NPA వంటి చర్యలు, MSMEలకు గ్యారంటీ వంటి చర్యలు ఉపకరించినట్లు చెబుతున్నారు. అలాగే, గత కొన్ని నెలలుగా FPIలు నిలిచిపోవడంతో, ఇటీవల భారీగా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అమెరికా డాలర్తో ఇటీవలి కాలంలో భారత కరెన్సీ కాస్త సానుకూలంగా ఉంది. చైనాను మినహాయిస్తే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని నాయర్ అన్నారు.
పెట్టుబడులు అందుకే
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అనిశ్చితులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. బ్రిటన్ వంటి కొత్త వైరస్ ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలోను పరిస్థితులు పూర్తిగా కుదురుకోలేదు. అలాగే ఆసియాలో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ కని పిస్తోంది. ఇలాంటి వివిధ కారణాలతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.