Foxconn: ఫాక్స్ కాన్ మెగా ప్లాన్.. కొత్తగా 53 వేల ఉద్యోగాలు.. ఐఫోన్ ఫ్యాక్టరీలో పెరిగిన స్పీడ్..
Foxconn: ఆపిల్ ఉత్పత్తులను తైవాన్ సంస్థ ఫాక్స్ కాన్ తయారు చేస్తోంది. అయితే చైనాలోని ప్రభుత్వ కరోనా ఆంక్షలు కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇదే క్రమంలో ఇటీవల చైనాలోని జంగ్ జౌ ఫ్యాక్టరీలో కరోనా కలకలంతో పెద్ద ఎత్తున ఉద్యోగులు గోడలు దూకి మరీ పారిపోయిన ఘటనలు మనందరం చూశాం. అయితే ఇప్పుడు భారత్ కు పెద్ద అవకాశంగా మారుతోంది. ఈ తరుణంలో కంపెనీ ప్రయాణం చైనా నుంచి ఇండియాకు జరుగుతోంది.
చెన్నై కేంద్రానికి..
చైనాలో ఉత్పత్తి దెబ్బతినటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ సంస్థకు రానున్న కాలంలో డిమాండ్ కు తగినట్లుగా సరఫరా ఉండకపోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఈ కారణాలతో ఆపిల్ సరఫరాదారు ఫాక్స్కాన్ భారతదేశంలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో తయారీని పెంచాలని నిర్ణయించింది. దీంతో తమిళనాడులోని తన ప్లాంట్ ఇప్పుడు తయారీకి కేంద్ర బిందువుగా మారుతోంది.
|
కొత్త ఉద్యోగాలు..
ఆపిల్ సరఫరాదారు ఫాక్స్ కాన్ ఉత్పత్తిని పెంచేందుకు కొత్తగా 53 వేల మందిని నియమించుకోవాలనే ఆలోచనలో ఉంది. చైనాలోని అన్ని కార్యకలాపాలను ఇండియాకు తరలించాలని ప్లాన్ చేస్తున్నందున.. రానున్న రెండేళ్లలో భారత్ లో తమ ఉద్యోగుల సంఖ్యను నాలుగు రెట్లు పెంచాలని కంపెనీ యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ శనివారం తెలిపింది. దీని ఫలితంగా చెన్నై లో ఉద్యోగుల సంఖ్య 70,000లకు పెరుగుతుందని తెలుస్తోంది.
ఆనంద్ మహీంద్రా..
ఈ అంశంపై భారత దిగ్గజ వ్యాపారవేత్త అయిన ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేధికగా స్పందించారు. ఇది 'గ్లోబల్ సప్లయ్ చైన్ షిఫ్ట్ సున్నితమైన ధ్వని' కాగలదా అని మహీంద్రా ట్విట్టర్లో ప్రశ్నించారు. తమిళనాడులోని ప్లాంట్ 2 లక్షల మంది ఉద్యోగులను నియమించుకోవటానికి అనువైనది కావటం ఉత్పత్తిని చైనాకు దూరంగా మార్చాలనే ఫాక్స్ కాన్ ప్లాన్ కు దోహదపడనుందని నిపుణులు అంటున్నారు.
అధికారులు..
చైనాలో అంతరాయాల కారణంగా భారతీయ ప్లాంట్లో నియామక ప్రయత్నాలను వేగవంతం చేయడం గురించి ఫాక్స్కాన్ తమిళనాడు అధికారులతో తన ప్రణాళికలను పంచుకున్నట్లు తొలుత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐఫోన్లకు మించి, ప్లాంట్ ఇతర గ్లోబల్ టెక్ సంస్థల కోసం ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది.