రమ్యకు థ్యాంక్స్: కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోస్ అనంతరం నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరోనా వ్యాక్సీన్ మొదటి డోస్ తీసుకున్నారు. ఢిల్లీ వసంత్ కుంజ్లోని ఫోర్టిస్ హాస్పిటల్లో ఈ డోస్ తీసుకున్నారు. ఈసందర్భంగా నిర్మలమ్మ మాట్లాడారు. భారత్లో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇందుకు గర్వకారణంగా ఉందన్నారు. అలాగే ఎంతో నైపుణ్యంతో తనకు టీకా వేసిన నర్సు సిస్టర్ రమ్యకు ధన్యవాదాలు చెప్పారు. వ్యాక్సీన్ అభివృద్ధి, పంపిణీ, సరైన సమయంలో, సరైన ధరలో టీకా లభిస్తున్న దేశంలో జన్మించడం తన అదృష్టమని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కోవిడ్ వ్యాక్సీన్ మొదటి డోస్ వేసుకున్నారు.
దేశంలో ప్రస్తుతం రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అరవై ఏళ్లు దాటిన వారికి, 45 సంవత్సరాలు పైబడి, అనారోగ్యంతో ఉన్న వారికి ఈ దశలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్తో పాటు పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర రంగాల దిగ్గజాలు ఈ టీకాను వేయించుకున్నారు.

ఇదిలా ఉండగా, భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ వ్యాక్సీన్ 81 శాతం ప్రభావశీలత కనబరచింది. మూడో దశ క్లినికల్ పరీక్షల మధ్యంతర విశ్లేషణలో ఈ విషయం నిర్థారణ అయినట్లు భారత్ బయోటెక్ ఇంటన్నేషనల్ బుధవారం తెలిపింది. కొవిడ్ 19 వ్యాధిని నిరోధించడంలో కొవాగ్జిన్ టీకా 81 శాతం ప్రభావశీలత ప్రదర్శించింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) భాగస్వామ్యంతో మనదేశంలో నిర్వహించిన అతిపెద్ద క్లినికల్ పరీక్ష ఇది అని భారత్ బయోటెక్ తెలిపింది. మనదేశంలో శాస్త్ర విజ్ఞానానికి, కరోనా పైన పోరాటానికి ఇది పెద్ద మైలురాయి అని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు.


Click it and Unblock the Notifications