Swamy vs Nirmala: నిర్మలమ్మపై స్వామి సెటైర్లు.. మాంద్యంపై రాజకీయ రగడ.. ఇందులో నిజమెంత..?
Swamy vs Nirmala: ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా మాంద్యం వస్తుందా అనే చర్చ అంతటా ఉంది. అయితే ఈ విషయంపై కొత్తగా రాజకీయ రగడ కూడా సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించి సొంత నేతల నుంచే ప్రభుత్వ ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం..
పార్లమెంటులో నిర్మలా సీతారామన్..
ద్రవ్యోల్బణంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోందని అన్నారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, దేశం మంచి స్థితిలోనే ఉందని వ్యాఖ్యానించారు. పరిస్థితులను కంట్రోల్ లో చేసేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. అమెరికా పరిస్థితిని ప్రస్తావిస్తూ.. భారత్లో మాంద్యం వచ్చే ప్రశ్నే లేదని సీతారామన్ తన ప్రసంగంలో చెప్పారు.
|
సివాలెత్తిన సుబ్రహ్మణ్య స్వామి..
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనపై కౌంటర్ ఇచ్చారు. భారత్ మాంద్యంలోకి జారుకునే ప్రసక్తే లేదని అనటాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఒక ట్వీట్ చేశారు. ఆమె చెప్పింది నిజమేనని.. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది క్రితమే మాంద్యంలోకి జారుకుందని, ఇప్పుడు కొత్తగా మాంద్యం వస్తుందనటం అవివేకమంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఆర్థిక మంత్రి ప్రకటనలను తప్పుపడుతూ స్వామి ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై పొలిటికల్ రచ్చతో పాటు, ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. గతంలో స్వామి అనేక సంచలన విషయాలను వెలుగులోకి తీసుకురావటంతో ఇదీ నిజమేనా అని ప్రజలు ఆలోచిస్తున్నారు.
రఘురామ్ రాజన్ పై ఇలా..
మాజీ RBI గవర్నర్ రఘురామ్ రాజన్ను ఆయుధంగా చేసుకుని.. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంపై ఎదురుదాడిని ప్రారంభించింది. రిజర్వు బ్యాంక్ పనితీరును రాజన్ ప్రశంసించిన విషయాన్ని నిర్మలా సీతారామన్ చెప్పారు. మోడీ ప్రభుత్వం అప్పులు తగ్గించడంలో మంచి పని చేస్తోందని రాజన్ కూడా అన్నారు.
విదేశీ అప్పులపై ఏమన్నారంటే..
విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచే పనిని రిజర్వ్ బ్యాంక్ చేసిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. దేశంలో తగినంత విదేశీ మారక ద్రవ్యం ఉంది. శ్రీలంక, పాకిస్థాన్ లాంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడవని రాజన్ తెలిపారు. భారత్కు విదేశీ అప్పులు ఉన్నాయని, అయితే అది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువని అన్నాయని వెల్లడించారు.
ద్రవ్యోల్బణం విషయంలో..
దేశంపై ద్రవ్యోల్బణం ఒత్తిడి ఉందని రాజన్ తెలిపారు. ఇది ప్రపంచంలో అన్ని దేశాలను ప్రస్తుతం వేధిస్తోందని అన్నారు. అయితే భారతీయ రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతూ ఆహార, ఇంధన ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుందని అభిప్రాయపడ్డారు. రఘురామ్ రాజన్ చేసిన ఈ ప్రకటన అనేకమందికి ఊరటను కలిగిస్తోంది.