FII sell-off: గత 12 నెలల్లో సెప్టెంబరు 21 ఒక్కరోజు మినహా ప్రతి రోజూ ఫారెన్ ఇన్వెస్టర్లు నిరంతరం తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. అయితే దేశీయ సంస్థలు ఈ అమ్మకాల ఒత్తిడిని భర్తీ చేస్తున్నారు. గతంలో పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే 2019లో నికర కొనుగోలు దారులుగా ఉన్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 40 వేల కోట్ల పెట్టుబడులను దేశంలోకి తెచ్చారు. ఇదే క్రమంలో 2020లో కూడా దాదాపు రూ. 64 వేల కోట్లను భారత్ లోకి పెట్టుబడుల రూపంలో తెచ్చారు.
రికార్డు స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ:
దేశీయ సంస్థలు 2019లో రూ. 42,000 కోట్లు పెట్టుబడులను కొనుగోలు చేయగా.., 2020లో మాత్రం రూ. 36,000 కోట్ల విలువైన పెట్టుబడులను విక్రయించాయి. 2021లో FIIలు రూ.93,000 కోట్ల విలువైన పెట్టుబడులను విక్రయించగా, దేశీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు రూ.95,000 కోట్ల విలువైన పెట్టుబడులను కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణపై కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లను వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అన్నారు. ఈ ఏడాది ఎఫ్ఐఐలు ఏకంగా రూ. 2.67 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. ఇదే సమయంలో దేశీయ సంస్థలు రూ. 2.15 లక్షల కోట్ల విలువైన ఇన్వెస్ట్ మెంట్లను కొనుగోలు చేశాయి. యూఎస్ లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఈ విక్రయాల వెనుక ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. మునుపటి వారంలో ఫెడ్ కీలక వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల పెరుగుదల, రానున్న కాలంలో మరిన్ని పెంపుల నేపథ్యంలో ఆందోళనలు నెలకొన్నాయి.

విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ తిరిగి వస్తారా..?
గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్న సమయంలో ఎఫ్ఐఐలు తమ మొత్తం ఎక్స్పోజర్ను పరిమితం చేయడానికి మన దేశంలో కంపెనీలు అందిస్తున్న లాభాలను దూకుడుగా క్యాష్ చేసుకుంటున్నాయి. తైవాన్, దక్షిణ కొరియా వంటి ఇతర వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లోనూ FPIలు దూకుడుగా అమ్మకాలు చేస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి కె విజయకుమార్ తెలిపారు. యూఎస్లో డాలర్ బలపడటం, బాండ్ రాబడులు పెరగడం FPI అమ్మకానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. త్వరలోనే విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారత మార్కెట్లలోకి తిరిగి వస్తారని, ఈక్విటీలను కొనుగోలు చేస్తారని నివేదికల ప్రకారం తెలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు తగ్గిపోవడం దేశీయ మార్కెట్లకు శుభవార్తగా చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications