హోం లోన్ కావాలంటే ఇన్సూరెన్స్ చెయ్యాల్సిందే .. తప్పనిసరి కాకున్నా ప్రైవేట్ బ్యాంకుల బలవంతపు భీమాలు !!
కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన విషయం తెలిసిందే. ఈ సమయంలో సామాన్య, మధ్యతరగతి ప్రజల గృహ కొనుగోలు సామర్ధ్యాన్ని పెంచడానికి బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించి గృహాలపై రుణాలు అందిస్తున్నాయి. దీంతో చాలామంది సామాన్య , మధ్య తరగతి ప్రజలు హోమ్ లోన్స్ తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇదే అదునుగా చాలా ప్రైవేటు బ్యాంకులు సదరు హోమ్ లోన్స్ కు ఇన్సూరెన్స్ చేయాల్సిందేనని పట్టుబడుతూ ఇన్సూరెన్స్ పేరుతో లక్షల రూపాయలను కస్టమర్ల నుండి వసూలు చేస్తున్నారు.
ఆస్తి తనఖా పెట్టుకున్నా ఇన్సూరెన్స్ లేకుంటే లోన్ ఇవ్వమంటున్న ప్రైవేట్ బ్యాంకులు
సాధారణంగా హోమ్ లోన్స్ ఇవ్వాలి అంటే లోన్ తీసుకున్న వ్యక్తి కొనుగోలు చేసే ఇంటి విలువ, అతని ఆదాయం, ఆదాయపు పన్ను రిటర్న్స్, సిబిల్ స్కోర్ తో పాటుగా కొనుగోలు చేసే ఆస్తి యొక్క అన్ని డాక్యుమెంట్స్ పక్కాగా చూసుకొని బ్యాంకులు లోన్లు ఇస్తాయి. హోమ్ లోన్ తీసుకునే వ్యక్తి యొక్క సదరు గృహాన్ని కూడా బ్యాంక్ పేరుతో మార్ట్ గేజ్ చేసుకుని తదనుగుణంగా లోన్లు ఇస్తాయి బ్యాంకులు. అయితే కొత్తగా చాలా ప్రైవేటు బ్యాంకులు హోమ్ లోన్ తీసుకునే వారిని కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఇన్సూరెన్స్ లేకపోతే సెక్యూరిటీ లేదని చెప్తున్నాయి.
ప్రాసెసింగ్ చార్జీలు , లీగల్ ఒపీనియన్ చార్జీల బాదుడే కాదు ఇన్సూరెన్స్ కూడా
ఇన్సూరెన్స్ చేయడం బ్యాంకు నిబంధనలలో తప్పనిసరి కాకున్నా చేసి తీరాల్సిందేనని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రాసెసింగ్ చార్జీలు, లీగల్ ఒపీనియన్ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, సిబిల్ రిపోర్ట్ చార్జీలు ఇలా రకరకాల పేరుతో ఛార్జీల బాదుడు మాత్రమే కాకుండా తప్పనిసరిగా సదరు హోమ్ లోన్ కోసం ఇన్సూరెన్స్ కూడా చేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక ఇరవై లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకుంటే దాదాపు చార్జీలు, ఇన్సూరెన్స్ పేరుతో లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
ఇష్టం అయితే లోన్ తీసుకోండి .. లేకుంటే పోండి .. ప్రైవేట్ బ్యాంకుల తీరు
అదేమని ప్రశ్నిస్తే ఇలా అయితేనే లోన్లు ఇస్తాము లేకపోతే ఇవ్వమంటూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. లోన్ ప్రాసెస్ చేసే పేరుతో కొద్దిరోజులు తాత్సారం చేసి, తీరా లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ తప్పనిసరి అని ఇబ్బంది పెడుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే కరోనా సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉందని, లోన్ తీసుకున్న వారికి ఏదైనా జరిగినా, ఇన్సూరెన్స్ ఉంటే హోం లోన్ డబ్బులను క్లెయిమ్ చేసుకోవడం ఈజీ గా ఉంటుందని, అలా కాకుండా ప్రాపర్టీ ద్వారా క్లైమ్ చేసుకోవాలంటే దానికి నాలుగు నాలుగు సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది అంటూ తేల్చి చెబుతున్నారు.
లోన్ల కోసం తిరగలేక బ్యాంకులు అడిగినంత ముట్టజెబుతున్న కస్టమర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కు, ఐఆర్డీఏఐ నిబంధనలకు ఇది విరుద్ధం అని తెలిసినప్పటికీ ప్రైవేటు బ్యాంకులు హోమ్ లోన్స్ ఇవ్వడానికి సామాన్య, మధ్యతరగతి ప్రజానీకాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇక లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే ఓపిక లేని మధ్య తరగతి ప్రజలు లోలోపల బాధపడుతూనే ప్రైవేటు బ్యాంకులు అడిగినంత ముట్టజెప్పి లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్న బ్యాంకులకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు హోమ్ లోన్స్ అందని ద్రాక్షగా చేస్తున్న, అందినకాడికి దోచుకుంటున్న ప్రైవేటు బ్యాంకులపై ఆర్బీఐ, ఐఆర్డీఏఐ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.