Forbes Rich List: ముఖేష్ అంబానీ 13వసారి, 2వ స్థానంలో అదానీ.. టాప్ 10 వీరే..
2020 ఏడాది వందమంది భారత కుబేరుల జాబితాలను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో కొంతమంది ముందుకు రాగా, మరికొంతమంది వెనక్కి వెళ్లారు. జాబితాలోకి కొత్తగా కొంతమంది చేరారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వరుసగా 13వ సంవత్సరం టాప్ 1గా నిలిచారు. మొత్తంగా టాప్ 100 మంది కుబేరుల సంపద 517.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే వీరి సంపద 14 శాతం పెరిగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది సంపద పెరిగింది.
ఉద్యోగులకు యాక్సిస్ బ్యాంకు గుడ్న్యూస్, 12% వరకు వేతనాల పెంపు
టాప్లో ముఖేష్ అంబానీ
వరుసగా 13వ సంవత్సరం ముఖేష్ అంబానీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన సంపద 88.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ఆయన సంపద 37.3 బిలియన్ డాలర్ల పెరిగింది. అంటే 73 శాతం పెరుగుదల నమోదయింది. ముఖేష్ అంబానీ ఈ ఏడాది ప్రారంభంలో రిలయన్స్ జియోలోకి, ఇప్పుడు రిలయన్స్ రిటైల్లోకి పెట్టుబడులు సమీకరిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో స్టాక్స్ అంతకంతకూ పెరిగి, సంపద ఎగిసింది.
2, 3, 4 స్థానాల్లో గౌతమ్ అదానీ, శివనాడార్, రాధాకిషన్ ధమానీ
- రెండో స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఈ ఏడాది ఆయన ఆస్తి 61 శాతం పెరిగి 25.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇటీవల ఆయన ముంబై విమానాశ్రయంలో 74 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
- 3వ స్థానంలో భారత మూడో ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ శివనాడార్ ఉన్నారు. ఆయన సంపద 20.4 బిలియన్ డాలర్లకు పెరిగి మూడో స్థానానికి ఎగబాకారు.
- అవెన్యూ సూపర్ మార్ట్స్ అధినేత (డిమార్ట్) రాధాకిషన్ ధమానీ 15.4 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
- 12.8 బిలియన్ డాలర్ల సంపదతో హిందూజా సోదరులు ఐదో స్థానంలో నిలిచారు.
- 11.5 బిలియన్ డాలర్లతో సైరస్ పూనావాలా 6వ స్థానంలో ఉన్నారు. కరోనా మహమ్మారి వ్యాక్సీన్ తయారీ నేపథ్యంలో ఇటీవల సంపద 26శాతం పెరిగింది.
ఎయిర్టెల్ చీఫ్ 10వ స్థానంలో
- కన్స్ట్రక్షన్ టైకూన్ పల్లోంజీ మిస్త్రీ 11.4 బిలియన్ డాలర్లతో 7వ స్థానంలో నిలిచారు.
- కొటక్ మహీంద్ర బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ ఫోర్బ్స్ టాప్ 100లో 8వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 11.3 బిలియన్ డాలర్లు.
- 11 బిలియన్ డాలర్లతో గోద్రేజ్ కుటుంబం 9వ స్థానంలో నిలిచింది.
- ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ 10.3 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో ఉన్నారు.
మజుందర్ షా సంపద దాదాపు డబుల్
ముఖేష్ అంబానీ సంపద 73 శాతం, అదానీ సంపద 61 శాతం పెరిగింది. సైరస్ పూనావాలా సంపద 26 శాతం పెరిగింది. పర్సెంటేజీ పరంగా బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందర్ షా సంపద అందరికంటే ఎక్కువగా పెరిగి 4.6 బిలియన్ డాలర్లుగా ఉంది. మజుందర్ షా సంపద 93 శాతం ఎగిసింది. గత ఏడాది 2.38 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాదికి 2.22 బిలియన్ డాలర్లు పెరిగి 4.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
జాబితాలోకి కొత్తగా 9 మంది వచ్చారు. ఇందులో సంజీవ్ బిక్చందానీ 68వ ర్యాంకు (2.1 బిలియన్ డాలర్లు)లో ఉన్నారు. జెరోదా బ్రోకరేజీ కంపెనీ కోఫౌండర్స్ నితిన్, నిఖిల్ 90వ స్థానం(1.55 బిలియన్ డాలర్లు)లో ఉన్నారు. జాబితాలో కొత్తగా చేరిన ముగ్గురిలో కెమికల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వినతి ఆర్గానిక్స్ ఫౌండర్ వినోద్ సరఫ్ 95వ స్థానం (1.4 బిలియన్ డాలర్లు), ఆర్తి ఇండస్ట్రీస్ చంద్రకాంత్-రాజేంద్ర గోగ్రి సోదరులు 96వ స్థానం (1.39 బిలియన్ డాలర్లు), ఎస్ఆర్ఎఫ్కు చెందిన అరుణ్ భరత్ రామ్ 99వ ర్యాంకు (1.34 బిలియన్ డాలర్లు) సాధించారు.