పాపం.. తిండి కోసం వెళ్లి చచ్చిపోతున్న పాకిస్థానీలు..! రోడ్డెక్కుతున్న జనం..
Pakistan Crisis: దాయాది పాకిస్థాన్లో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నాయి. తినటానికి కూడా జనం దగ్గర స్థోమత లేదు. దశాబ్దాలు పాక్ నాయకులు చేసిన పాపాలు ఇప్పుడు అక్కడి ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభానికి కారణమైంది. దీంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది.
చచ్చిపోతున్న ప్రజలు..
ఒక్కపూట భోజనంతో కడుపు నింపుకోవటానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. ఇటీవల గోధుమ పిండి కొనేందుకు పెద్ద సంఖ్యలో జనం పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి నలుగురు మృతి చెందటం అక్కడి దారుణ పరిస్థితులకు అద్ధం పడుతోంది. ప్రస్తుతం దాయాది దేశంలో గోధమ నిల్వలు ఖాళీ అయ్యే స్థితికి చేరుకున్నాయని తెలుస్తోంది.
వీధుల్లో జనాలు..
ప్రభుత్వ సాయం కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో వీధుల్లో ఎక్కడ చూసినా పొడవాటి క్యూలే దర్శనమిస్తున్నాయి. ప్రజలు ఆహార పదార్థాల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్లో గోధుమల ధర రూ.5,000 దాటింది. రావల్పిండిలో కిలో గోధుమ పిండిని రూ.150- 200కు విక్రయిస్తున్నారు. డజను గుడ్ల ధర రూ.330, చికెన్ కిలో రూ.650, పాలు లీటరు రూ.190, నెయ్యి రూ.540, నూనె కిలో రూ.580కి విక్రయిస్తున్నారు. ఈ ధరలకు ఆహారాన్ని ఎలా కొనుక్కుని తినాలంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సగం జనం ఆకలితో..
పాకిస్థాన్లో నివసిస్తున్న మెుత్తం జనాభాలో దాదాపుగా సగం మంది ఆకలి కేకలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. సింధ్ ప్రావిన్స్లో ప్రభుత్వం తక్కువ ధరలకు ఆహార ధాన్యాలను విక్రయిస్తోందన్న వార్తలు వ్యాపించడంతో జనం అక్కడికి పరుగులు తీస్తున్నారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పైగా గోధుమ నిల్వలు తరిగిపోయాయని పాకిస్థాన్ మంత్రులు చెప్పటం అక్కడి ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యాయి.
కరెంట్, గ్యాస్ కష్టాలు..
పాకిస్థాన్లో కరెంట్ కష్టాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో అక్కడ ప్రభుత్వం పొదుపు మంత్రాన్ని పాటించాలని నిర్ణయించింది. అలా రాత్రి 8 గంటలకే మార్కెట్ల మూసివేత, ఫంక్షన్ హాల్స్ సమయాల కుదింపు వంటి చర్యలు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పొదుపుకు చర్యలు చేపట్టింది. పాత టెక్నాలజీతో పనిచేసే ఉపకరణాలు ఎక్కువ విద్యుత్తును వినియోగించుకోవడమే దీని వెనుక కారణం. ఇలా చేయడం వల్ల రూ.2,200 కోట్లు ఆదా అవుతుందని పాకిస్థాన్ పేర్కొంది. గ్యాస్ రేట్లు సైతం ఆకాశాన్ని తాకాయి.
పాకిస్థాన్ ఖర్చులు..
ఈ పరిస్థితికి పాకిస్థాన్ ఖర్చులు, అవలంభించిన విధానాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి కంటే మిలిటరీకే ఎక్కువ ఖర్చు చేయడం, చైనాతో స్నేహం, తప్పుడు రంగాల్లో ఖర్చు చేయడం పాకిస్థాన్ను పేదరికంలోకి నెట్టాయి. పాక్ సైన్యం కోసం రూ.18,800 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం.. అభివృద్ధికి మాత్రం కేవలం రూ.4,300 కోట్లను సరిపెట్టింది. ప్రస్తుతం ప్రజలను కాఫీ, టీ కూడా ఎక్కువగా వినియోగించొద్దని అక్కడి ప్రభుత్వం కోరటం పరిస్థినికి వెల్లడిస్తుంది. పైగా చైనా నుంచి వచ్చే గ్రాంటులు కూడా ఇటీవల తగ్గాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా చెల్లింలేని అద్వాన స్థితికి చేరుకుంది.