Wheat: గోధుమ ధరలను నియంత్రిస్తాం.. ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా..
రష్యా, ఉక్రెయిన్ మన దేశంలో గోధుమల ధర పెరుగుతూ వస్తోంది. దీంతో మేలో గోధుమ ఎగుమతులను నిషేధించింది. అయినా కూడా గోధమల ధర ఎక్కువగానే ఉంది. గోధుమలు, పిండి రిటైల్ ధరలు పెరిగాయని, ధరల నియంత్రణకు ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకుంటుందని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. గోధుమలు, పిండి ధరలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. ధరలను తగ్గించడానికి పరిష్కారాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.
సరిపడా నిల్వలు
"గోధుమలు, పిండి ధరలు పెరిగినట్లు మేము చూస్తున్నాము. సమస్య గురించి మాకు తెలుసు. ధరల తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అతి త్వరలో మేము మా ప్రతిస్పందనను తెలియజేస్తాము" అని సంజీవ్ చోప్రా అన్నారు. త్వరలోనే మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయితే, మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చర్యలపై సంజీవ్ చోప్రా స్పష్టత ఇవ్వలేదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ) గోడౌన్లలో గోధుమలు, బియ్యం సరిపడా నిల్వలు ఉన్నాయని కార్యదర్శి తెలిపారు.
ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్
దేశీయ ఉత్పత్తిలో స్వల్ప తగ్గుదల, సెంట్రల్ పూల్ కోసం ఎఫ్సిఐ సేకరణలో కొరత కారణంగా ధరలను నియంత్రించడానికి కేంద్రం మేలో గోధుమ ఎగుమతులను నిషేధించింది. ప్రభుత్వం గోధుమలను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుందా అని అడిగినప్పుడు, అన్ని ఎంపికలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. పెరుగుతున్న రిటైల్ ధరలను నియంత్రించడానికి ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) కింద పిండి మిల్లుల వంటి బల్క్ వినియోగదారులకు FCI స్టాక్ల నుంచి వచ్చే ఏడాది 1.5-2 మిలియన్ టన్నుల గోధుమలను విడుదల చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని సోర్సెస్ గత నెలలో తెలిపాయి.
ఆహార ధాన్యాలను
OMSS విధానం ప్రకారం, ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఆహార ధాన్యాలను, ప్రత్యేకించి గోధుమలు, బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో ముందుగా నిర్ణయించిన ధరలకు పెద్దమొత్తంలో వినియోగదారులకు, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. లీన్ సీజన్లో సరఫరాను పెంచడం, సాధారణ బహిరంగ మార్కెట్ ధరలను తగ్గించడం దీని లక్ష్యం.