15వ తేదీ కల్లా ఆ స్కీం ప్లాన్ ప్రకటించండి: నిర్మలా సీతారామన్
కరోనా మహమ్మారి కారణంగా ఒత్తిడిని తగ్గించడానికి, లోన్ మారటోరియం ఎత్తివేసిన తర్వాత రుణగ్రహీతలకు అవసరమైన మద్దతు ఇచ్చేందుకు బ్యాంకులు, NBFCలు ఈ నెల 15వ తేదీలోగా రుణ పునర్వ్యవస్థీకరణ స్కీంను ప్రకటించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. షెడ్యూల్డ్ బ్యాంకులు, NBFCల అధినేతలతో వర్చువల్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రుణ పునర్వ్యవస్థీకరణపై అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా ప్రచారం చేయాలన్నారు. బ్యాంకు బోర్డులు ఆమోదం పొందిన పరిష్కార విధానాన్ని వెంటనే ప్రకటించాలన్నారు.
SBI ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీం, 30,000 మంది ఔట్!! పథకం వివరాలివీ...
ఇలా ప్రచారం చేయండి...
మారటోరియంను ఎత్తివేసిన నేపథ్యంలో రుణ పునర్నిర్మాణ పథకం నుండి సరైన మద్దతును అందించాలని నిర్మలా సీతారామన్ కోరారు. బోర్డు స్థాయిలో తక్షణమే దీనికి అనుమతులు ఇవ్వాలన్నారు. అర్హత కలిగిన రుణ గ్రహీతలను గుర్తించాలని, వారి రుణాలకు సమర్థవంతమైన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను అందించాలన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషలలో బ్యాంకింగ్ తమ వెబ్ సైట్లలో అప్ డేట్ చేయాలని, సంబంధిత ప్రణాళికను తమ ప్రధాన, బ్రాంచ్ ఆఫీసుల్లో సర్క్యులేట్ చేయాలన్నారు.
పరిష్కార విధానాలతో సిద్ధం
తమ పరిష్కార విధానాలతో సిద్ధంగా ఉన్నామని, అర్హత కలిగిన రుణగ్రహీతల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించినట్లు బ్యాంకులు తెలిపాయి. ఆర్బీఐ ఆగస్ట్ 6వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఇచ్చిన గడువులోగా పూర్తి చేస్తామన్నారు.
మాకూ రీఫైనాన్స్ చేయండి
కరోనా నేపథ్యంలో కస్టమర్ల రుణాలు రీఫైనాన్స్ చేయమని ఎన్బీఎఫ్సీలను కూడా ఆర్థికమంత్రి కోరారు. దీనికి ఎన్బీఎఫ్సీలు కూడా ఓ విజ్ఞప్తి చేశాయి. తమకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను రీఫైనాన్స్ చేయాలని, లేదంటే నగదు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. లేదా ప్రజల డిపాజిట్లను నిర్దిష్ట నియంత్రణల మధ్య ఉపయోగించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా, డెబిట్ సర్వీస్ కవరేజ్ రేషియో, డెబిట్ ఈక్విటీ రేషియోపై కేవీ కామత్ నేతృత్వంలో ఏర్పాటయిన ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉంది. త్వరలో ఈ నివేదిక సమర్పించాల్సి ఉంది. నివేదిక సమర్పణ గడువు నెల రోజులు కాగా, ఈ గడువు ఈ నెల 7వ తేదీతో ముగియనుంది.