మాంద్యం లేదా? మరి దివాలా పరిస్థితులు దేనికి సంకేతం?: యశ్వంత్ సిన్హా
దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించిందే తప్ప మాంద్యం లేదని, రాబోదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడాన్ని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తప్పుబట్టారు. కంపెనీలు వరుసబెట్టి దివాలా ప్రకటించడం దేనికి నిదర్శనమంటూ ఆయన ప్రశ్నించారు. మన ఆర్థిక వ్యవస్థ స్థితిపై ఇప్పటికీ ప్రభుత్వం భ్రమలో ఉందంటూ చురకలంటించారు.
నేషనల్ ఎకానమీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. డిమాండ్ పూర్తిగా బలహీనపడడం ప్రస్తుత సంక్షోభానికి కారణమని పేర్కొంటూ.. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిపై ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యలు తీవ్రంగా నిరాశపర్చాయన్నారు. మోడీ సర్కారు ఇప్పటికీ ఇదే భ్రమలో కొనసాగితే సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
వ్యవసాయ రంగంలో ఒత్తిళ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని సిన్హా విమర్శించారు. ''ప్రస్తుతం చూస్తున్న ఆర్థిక సంక్షోభం రాత్రి రాత్రే వచ్చింది కాదన్నారు. ఇదేదో హఠాత్తుగా జరిగిన రైలు ప్రమాదం లాంటిది కాదని, చాలాకాలంగా చాపకింద నీరులా నెమ్మదిగా పెరుగుతూ వచ్చిందని చెప్పారు. దేశంలోని చాలా కంపెనీలు ఒక్కొక్కటిగా దివాలా తీస్తున్నాయని, ఇది దేనికి సంకేతం?'' అని ఆయన ప్రశ్నించారు.
కొనేవాళ్లు దొరక్కపోతే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను మూసేయడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వమే చెబుతోందని, దీనివల్ల అందులో పనిచేసే వేలాది ఉద్యోగులు నష్టపోతారని, వారు అడుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారంటూ యశ్వంత్ సిన్హా తీవ్రంగా ఆక్షేపించారు.
దేశ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ప్రస్తుత సంక్షోభమంతా దేశీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల తలెత్తిందేనని, దీనికి ఏవేవో కారణాలు చెబుతూ ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని సిన్హా వ్యాఖ్యానించారు. రిజర్వ్ బ్యాంక్ను ప్రభుత్వమే దోచుకున్నప్పటికీ.. ఈ ఏడాది దేశ ఆర్థిక స్థితి మరింత దుర్భరంగా ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర ఆర్థికవేత్తలు కూడా.. దేశ ఆర్థిక వ్యవస్థకు దేశీయ పరిస్థితులే కారణమని, ప్రభుత్వం ఏం చేయాలో అర్థంకాక చేష్టలుడిగి చూస్తోందని అభిప్రాయపడ్డారు.