అదానీ చేతికి ఇ-కామర్స్ జెయింట్: వ్యూహాత్మక భాగస్వామిగా ఎంట్రీ: స్టేక్స్పై కన్ను
ముంబై: అదానీ గ్రూప్.. ఇప్పటిదాకా పోర్టులు, ఎయిర్పోర్టులు, పవర్ ప్రాజెక్టుల వంటి మౌలికరంగ కంపెనీలకు మాత్రమే పరిమితమైన ఈ దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఇక ఇ-కామర్స్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చింది. వాల్మార్ట్కు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ జెయింట్ ఫ్లిప్కార్ట్ (Flipkart) సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఫ్లిప్కార్ట్తో స్ట్రాటజిక్, కమర్షియల్ పార్ట్నర్షిప్ను కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని అదాని గ్రూప్ సంస్థ అధినేత గౌతమ్ అదాని స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఆయన ఓ ట్వీట్ చేశారు.
|
డేటా సెంటర్.. లాజిస్టిక్ సర్వీసులు
అదాని గ్రూప్ సంస్థల్లో ఒకటైన అదాని కనెక్స్ (AdaniConneX)-ఫ్లిప్కార్ట్ మధ్య వ్యూహాత్మక, వాణిజ్యపరమైన భాగస్వామ్యం కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు. అదాని కనెక్స్.. అదాని గ్రూప్ సంస్థల్లో టయర్ 4 డేటా సెంటర్. ఆ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా అదాని గ్రూప్ సంస్థల యాజమాన్యం కొత్తగా లాజిస్టిక్ విభాగాన్ని నెలకొల్పుతుంది. ఫిప్కార్ట్కు అందిన ఆర్డర్లను కొనుగోలుదారుల ఇళ్ల వద్దకు చేరవేయడానికి ఉద్దేశించిన లాజిస్టిక్ సర్వీసులను ఈ విభాగం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఫలితంగా ముంబైలో 2,500 వరకు కొత్తగా ఉద్యోగాలను కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది.
ముంబైలో భారీ గోడౌన్..
దీనితోపాటు- లాజిస్టిక్ సౌకర్యాలను కల్పించడంలో భాగంగా ముంబైలో 5,34,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఓ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ (గోడౌన్)ను నెలకొల్పుతామని గౌతమ్ అదానీ వెల్లడించారు. దీనితోపాటు- చెన్నైలో కొత్తగా డేటా సెంటర్ను నెలకొల్పుతుంది. ఇప్పటిదాకా అదాని గ్రూప్లో రెండు డేటా సెంటర్లు ఉన్నాయి. చెన్నైలో ఏర్పాటు చేయదలిచిన డేటా సెంటర్ మూడోది అవుతుంది. ఎడ్జ్ కనెక్స్ అండ్ అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మధ్యయ జాయింట్ వెంచర్ను కుదుర్చుకోనుందా సంస్థ.
ఆత్మనిర్భర్ భారత్..
దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న రెండు పారిశ్రామిక దిగ్గజాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధం ఏర్పడటం హర్షణీయమని అదాని పోర్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఏపీసెజ్) విభఆగం ముఖ్య కార్యనిర్వహణాధికారి కరణ్ అదాని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆత్మనిర్భర్ భారత్కు ఇది నిదర్శనమని చెప్పారు. ఫ్లిప్కార్ట్ వంటి ఇ-కామర్స్ దిగ్గజ సంస్థతో లాజిస్టిక్, డేటా సెంటర్ల బిజినెస్ లావాదేవీలను నిర్వహించబోతోండటం ఎగ్జయిటింగ్గా ఉందంటూ పేర్కొన్నారు. లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్స్, గ్రీన్ ఎనర్జీ, డేటా, ఇన్ఫ్రా సంస్థల్లో టాప్లో ఉన్న అదాని గ్రూప్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం గర్వకారణమని ఫ్లిప్కార్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కల్యాణ్ కృష్ణమూర్తి పేర్కొన్నారు.