టిక్కెట్ క్యాన్సిల్ చేశారా.. విమాన ప్రయాణీకులకు గుడ్న్యూస్
లాక్ డౌన్ నేపథ్యంలో విమాన ప్రయాణీకులకు శుభవార్త. లాక్ డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లను రద్దు చేసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. టిక్కెట్లు రద్దు చేసినా డబ్బులు మాత్రం నగదు రూపంలో ఇచ్చేందుకు విమానయాన సంస్థలు నిర్ణయించాయి. ఆ డబ్బులు తమ వద్దనే క్రెడిట్ షెల్లో అట్టి పెట్టుకుంటామని, తదుపరి బుకింగ్ సమయంలో వాటిని ప్రయాణీకులు ఉపయోగించుకోవచ్చునని వెల్లడించాయి.
ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త, కరోనా టైంలో వేతనాలు పెరిగాయి, రూ.10,000 అలవెన్స్
టిక్కెట్ డబ్బులు చెల్లించాలి
తాజాగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఫ్లైట్ టిక్కెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ రూల్స్ని విడుదల చేసింది. లాక్ డౌన్ సమయంలో ప్రయాణానికి విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి టిక్కెట్ సొమ్మును తిరిగి ఇవ్వాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 24వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ తొలి విడద ఏప్రిల్ 15వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు రెండో విడత లాక్ డౌన్ సమయంలో కొందరు విమానాలు బుక్ చేసుకున్నారు.
పూర్తిగా రీఫండ్ చేయాలి
లాక్ డౌన్ సమయంలో కొందరు డొమెస్టిక్, మరికొంతమంది అంతర్జాతీయ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో టిక్కెట్ డబ్బులు రీఫండ్ విషయంలో అభ్యంతరాలు రావడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. కొన్ని సంస్థలు తమ వద్దే ఛార్జీలు అట్టిపెట్టుకొని, తర్వాతసారికి ఉపయోగించాలని చెప్పగా, మరికొన్ని సంస్థలు సర్వీస్ ఛార్జీలు, లెవీ కింద కొన్ని కటింగ్స్ చేయాలని నిర్ణయించాయి. దీంతో డీజీసీఏ.. విమాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. టిక్కెట్ రద్దు చేసుకున్న వారికి మూడు వారాల్లో పూర్తిగా రీఫండ్ చేయాలని తెలిపింది.
క్యాన్సిలేషన్ ఛార్జీలు వద్దు
విమానయాన సంస్థలు ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు విధించవద్దని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆదేశించింది. తద్వారా ప్రయాణించాలనుకొని రద్దయిన వారికి భారం తగ్గించింది. ఈ ఆదేశాలకు సంబంధించి డీజీసీఏ పరిశీలించాలని తెలిపింది. కాగా లాక్ డౌన్ సమయంలో విమానయాన రంగం 3.6 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని చవి చూస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.